ముత్యాలమ్మ పండుగ ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పిల్లుట్ల రఘు
హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ముత్యాలమ్మ తల్లిని వేడుకున్న రఘు

హుజూర్నగర్, సెప్టెంబర్ 6: హుజూర్నగర్ పట్టణంలో అత్యంత వైభవంగా జరుగుతున్న ముత్యాలమ్మ పండుగ ఉత్సవాల్లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు పిల్లుట్ల రఘు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్యాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, చీర, సారె, పూలు, పండ్లు, నైవేద్యాలను సమర్పించారు.
అనంతరం పిల్లుట్ల రఘు మాట్లాడుతూ.. హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో, సుఖసంతోషాలతో విలసిల్లాలని, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ముత్యాలమ్మ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు.

హుజూర్నగర్ ముత్యాలమ్మ జాతరకు రాష్ట్రస్థాయి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మేళ్లచెర్వు జాతర తరహాలో హుజూర్నగర్ ముత్యాలమ్మ జాతరను కూడా రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందేలా కృషి చేస్తానని చెప్పారు. మేళ్లచెర్వు జాతరలో ఎద్దుల పందేలు, కబడ్డీ పోటీలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తూ జాతరకు రాష్ట్రస్థాయి గుర్తింపు తీసుకొచ్చిన విధంగానే హుజూర్నగర్ ముత్యాలమ్మ జాతరను కూడా మరింత వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు.
ముత్యాలమ్మ జాతరకు ఈ రెండు రోజుల్లో లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుతంగా జాతరను నిర్వహించాలని రఘు కోరారు.
అంతకుముందు పొట్టి శ్రీరాములు సెంటర్ నుంచి డప్పు కళాకారుల కోలాహలం, భారీ జనసందోహం మధ్య రఘును ఆలయం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, నిర్వాహకులు పిల్లుట్ల రఘును ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ జగన్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఉద్యమ నాయకులు, న్యాయవాది నగేష్ రాథోడ్, ముల్కపల్లి రాంబాబు, స్థానిక కౌన్సిలర్ నాగరాజు, కౌన్సిలర్లు కొలపూడి శ్రీనాథ్, చిట్టీపోతుల రమేష్, సుభద్ర, శ్రీనివాస్ రాజు, జడ అంజి, లక్క వెంకన్న, గుగులోత్ సందీప్, నరేంద్ర, మండవ నాగేశ్వరరావు, కోటేశ్వరి, మేరీగా సాయి, హన్ను, భూక్యా రాముడు, పృథ్వి, శ్రీకాంత్, పంగా శ్రీను, లావుడియా శ్రీను, సామూల నర్సింహారెడ్డి, రమేష్ తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



