ఫోన్పే ద్వారా లంచం.. ఏసీబీ వలలో లింగయ్యపల్లి పంచాయతీ కార్యదర్శి
లింగయ్యపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి రూ.13 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన మండలంలో కలకలం రేపింది. నగదు రూపంలో కాకుండా ఫోన్పే ద్వారా లంచం తీసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో ఆమెను పట్టుకున్నారు.

ఫోన్పే ద్వారా లంచం.. ఏసీబీ వలలో లింగయ్యపల్లి పంచాయతీ కార్యదర్శి
జన్నారం, ఆగస్టు 21 (నిజం న్యూస్):
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు కొరడా ఝళిపించారు. లింగయ్యపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి రూ.13 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన మండలంలో కలకలం రేపింది. నగదు రూపంలో కాకుండా ఫోన్పే ద్వారా లంచం తీసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో ఆమెను పట్టుకున్నారు.
ఇంటి నిర్మాణ అనుమతికి రూ.15 వేలు డిమాండ్
లింగయ్యపల్లికి చెందిన సందేవేణి తిరుపతి తన ఇంటి నిర్మాణ అనుమతి కోసం పంచాయతీ కార్యాలయాన్ని ఆశ్రయించాడు. అనుమతి మంజూరు చేయడానికి పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి రూ.15 వేలు లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఫోన్పే ద్వారా లంచం బదిలీ
ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ జి. మధు పర్యవేక్షణలో అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్నారు. నగదు నేరుగా తీసుకుంటే పట్టుబడతాననే ఉద్దేశంతో కార్యదర్శి వరలక్ష్మి మరో వ్యక్తి ఫోన్ నంబర్కు ఫోన్పే ద్వారా రూ.13 వేలు బదిలీ చేయించినట్లు అధికారులు గుర్తించారు. బాధితుడు ఏసీబీ సూచనల మేరకు నగదు బదిలీ చేయగానే అధికారులు రంగంలోకి దిగి పంచాయతీ కార్యాలయంలో రికార్డులను స్వాధీనం చేసుకుని కార్యదర్శిని అదుపులోకి తీసుకున్నారు.
డిజిటల్ లావాదేవీలైనా ఆధారాలతో పట్టుబడతారు
లంచం నగదు రూపంలో కాకుండా యూపీఐ, ఫోన్పే వంటి డిజిటల్ మార్గాల్లో తీసుకున్నా చట్టం నుంచి తప్పించుకోలేరని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. లంచం సొమ్ము స్వీకరించిన మరో వ్యక్తి కూడా గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.
నిందితురాలిపై కేసు నమోదు చేసి కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో జన్నారం మండలంలోని మిగతా పంచాయతీ కార్యదర్శుల్లోనూ గుబులు మొదలైనట్లు చర్చ జరుగుతోంది.
శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో



