నీట్ వివాదానికి నైతిక బాధ్యత.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి తన రాజీనామా పత్రాన్ని సమర్పించినట్లు ఆయన వెల్లడించారు.

న్యూఢిల్లీ, జులై 25 (నిజం న్యూస్): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్–యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ వివాదం, పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న లోపాలు, విద్యార్థుల నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి తన రాజీనామా పత్రాన్ని సమర్పించినట్లు ఆయన వెల్లడించారు.
గత కొన్ని వారాలుగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువజన సంఘాలు, పలు రాజకీయ పార్టీలు నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశాయి. పరీక్షా వ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతిన్నదని ఆరోపిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో తనపై ఉన్న నైతిక బాధ్యతను స్వీకరిస్తూ ఆయన పదవికి రాజీనామా చేసినట్లు తన లేఖలో పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు, దేశ ప్రయోజనాలే తనకు ముఖ్యమని, ఈ వివాదం మరింత రాజకీయ, న్యాయపరమైన సంక్లిష్టతలకు దారితీయకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పరీక్షల వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026 ముసాయిదాను విడుదల చేసి, పేపర్ లీక్లు, పరీక్షల అక్రమాలపై కఠిన శిక్షలు, భారీ జరిమానాలు, ఫాస్ట్ట్రాక్ కోర్టుల ద్వారా వేగవంతమైన విచారణ వంటి కీలక నిబంధనలను ప్రతిపాదించింది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్ర మంత్రివర్గంలో విద్యాశాఖ బాధ్యతలను తదుపరి ఎవరు చేపడతారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం కొత్త విద్యాశాఖ మంత్రిని నియమించే అవకాశం ఉంది.
ఇక విద్యార్థి సంఘాలు ఈ పరిణామాన్ని స్వాగతిస్తూ, పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత, పేపర్ లీక్లకు బాధ్యులపై కఠిన చర్యలు, దీర్ఘకాలిక విద్యా సంస్కరణలను వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
— శ్రీనివాస్ నాయక్, స్టేట్ బ్యూరో



