వేపల సింగారం పల్లె ప్రకృతి పై గొడ్డలి వేటు ..!
లక్షల ప్రజాధనం గోవిందా.. చెట్లను నరికి సొమ్ము చేసుకున్న కిలాడీలు..!

ప్రభుత్వం పచ్చదనం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటే, క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు, నాయకులతో కలిసి ఆ పచ్చదనాన్ని కాస్తా ‘పచ్చని నోట్లు’గా మార్చుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపల సింగారం గ్రామ కంఠంలో, మిట్టగూడెం, పరిధిలో ఉన్న పల్లె ప్రకృతి వనాలే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది.
వనాన్ని నరికారు.. సొమ్ము చేసుకున్నారు..!
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 8 లక్షల రూపాయల ఖర్చుతో, గ్రామంలోని గ్రామ కంఠం పరిధిలో ఒక ప్రకృతి వనం ,ఎన్ఎస్పీ కెనాల్ పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో మరొకటి రెండు వనాలను ఏర్పాటు చేశారు. ఎంతో కష్టపడి పెంచిన చెట్లు ఇప్పుడు నీడను ఇచ్చే స్థాయికి చేరాయి. అయితే, ఎండాకాలంలో నీరు పోసి కాపాడాల్సిన వారే గొడ్డలికి పని చెప్పారు. గ్రామపంచాయతీ సిబ్బంది సహాయం చెట్లను నరికి
ఆ విలువైన చెట్లను గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
పంచాయితీ కార్యదర్శి పర్యవేక్షణ శూన్యం..!
లక్షలాది రూపాయల ప్రజాధనంతో పెరిగిన ప్రభుత్వ ఆస్తులను (చెట్లను) బహిరంగంగా నరికి అమ్ముతుంటే పంచాయతీ కార్యదర్శి ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది అధికారుల కనుసన్నల్లోనే జరిగిందా? లేక సిబ్బందే ఇష్టారాజ్యంగా వ్యవహరించారా? అని గ్రామస్తులు నిలదీస్తున్నారు. అమ్ముకున్న సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్ళిందో తేలాలని డిమాండ్ చేస్తున్నారు.
గ్రామస్తుల ఆగ్రహం – విచారణకు డిమాండ్..!
చెట్లు పెరుగుతుంటే ఊరంతా సంతోషపడ్డాం.. కానీ ఇప్పుడు వాటిని మొద్దులుగా మార్చి అమ్ముకోవడం చూస్తుంటే బాధేస్తోంది” అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వనాన్ని ధ్వంసం చేసి, చెట్లను అమ్ముకున్న వారిపై కేసులు నమోదు చేయాలని, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పూర్తిస్థాయి విచారణ జరపాలని గ్రామస్తులు కోరుతున్నట్లు సమాచారం.



