గుప్తనిధుల పేరుతో క్షుద్రపూజల కలరింగ్.. రూ.కోటి వరకు మోసం!
బొగ్గును బంగారంగా మారుస్తామంటూ నమ్మబలికిన ముఠా.. నలుగురు అరెస్ట్

హైదరాబాద్, ఆగస్టు 11:
గుప్తనిధుల పేరుతో అమాయక ప్రజలను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ సిటీ శంషాబాద్ జోన్ కమిషనర్ టాస్క్ఫోర్స్ పోలీసులు, రాజేంద్రనగర్ పోలీసుల సహకారంతో రట్టు చేశారు. ఇళ్ల కింద గుప్తనిధులు ఉన్నాయని, వాటిని ప్రత్యేక పూజల ద్వారా బయటకు తీస్తామని నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు కార్లు, ఒక ఆటో, రెండు మోటార్ సైకిళ్లు, నాలుగు సెల్ఫోన్లు, నకిలీ బంగారు పూత నాణేలు, బొగ్గు, మట్టి, పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ప్రత్యేక శక్తులు ఉన్నాయంటూ నమ్మించి..
పోలీసుల వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు మహ్మద్ మునావర్ (36) హైదరాబాద్లో పుట్టి పెరిగాడు. కార్ల డెంటింగ్, పెయింటింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్న అతడు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గుప్తనిధుల పేరుతో మోసాలకు తెరతీసినట్లు పోలీసులు తెలిపారు.
తనకు గుప్తనిధులను గుర్తించి బయటకు తీసే ప్రత్యేక విద్య, శక్తులు ఉన్నాయని ప్రచారం చేసుకుంటూ అమాయకులను టార్గెట్ చేసేవాడు. అనంతరం తన స్నేహితులైన సయ్యద్ అలీ అష్రఫ్ (40), మహ్మద్ హాజీ (25), మహ్మద్ సల్మాన్ (29)లను ఈ వ్యవహారంలోకి తీసుకొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.
ముందే బొగ్గు.. నకిలీ నాణేలు సిద్ధం
ముఠా సభ్యులు ముందుగా బాధితులను నమ్మించి వారి ఇళ్ల కింద లేదా వారు సూచించిన ప్రాంతంలో గుప్తనిధులు ఉన్నాయని చెప్పేవారు. అనంతరం అక్కడ గుంత తీయించి, ముందుగానే సిద్ధం చేసుకున్న బొగ్గు, నకిలీ బంగారు పూత నాణేలు ఉన్న సంచిని రహస్యంగా గుంతలో పెట్టేవారు.
ఆ తర్వాత అక్కడ పూజలు నిర్వహించి, బొగ్గు కొంతకాలం తర్వాత బంగారంగా మారుతుందని బాధితులను నమ్మించేవారు. పూజలు పూర్తయ్యేలోపే అక్కడి నుంచి వెళ్లిపోయి, బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
11 మందిని టార్గెట్.. రూ.కోటి వరకు వసూలు?
పోలీసుల దర్యాప్తులో ఈ ముఠా వివిధ ప్రాంతాల్లో సుమారు 11 మందిని మోసం చేసి, దాదాపు రూ.1 కోటి వరకు వసూలు చేసినట్లు ఆధారాలు లభించినట్లు వెల్లడైంది. ఈ మోసాలకు సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భారీగా వస్తువులు స్వాధీనం
నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో:
– రెండు కార్లు
– ఒక ఆటో రిక్షా
– రెండు మోటార్ సైకిళ్లు
– నాలుగు సెల్ఫోన్లు
– 25 నకిలీ బంగారు పూత నాణేలు
– 6 కిలోల బొగ్గు
– 4 కిలోల మట్టి
– పూజా సామగ్రి
ఉన్నాయి.
ప్రధాన నిందితుడిపై గతంలోనూ కేసు
ప్రధాన నిందితుడు మహ్మద్ మునావర్పై గతంలో బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మోసం కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
రాజేంద్రనగర్ పీఎస్లో కేసు నమోదు
ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 916/2026 కింద కేసు నమోదు చేశారు. BNS సెక్షన్లు 318(4), 351(2), 61(2) r/w 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పోలీసులు
గుప్తనిధులు, పాతకాలం నాటి బంగారం, పూజల ద్వారా సంపద రెట్టింపు చేయడం, బొగ్గును బంగారంగా మార్చడం వంటి మాటలు చెప్పి మోసాలకు పాల్పడే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇలాంటి మాటలను నమ్మి డబ్బులు ఇవ్వవద్దని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఈ ముఠా పట్టుబడటంలో హైదరాబాద్ సిటీ శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె. రవి, సబ్ఇన్స్పెక్టర్లు కె. మన్సూర్ అలీ, నర్సింగరావు, ఎస్. శేషుతో పాటు ఇతర టాస్క్ఫోర్స్ సిబ్బంది, రాజేంద్రనగర్ పోలీసులు సమన్వయంతో కీలకంగా వ్యవహరించారు.
శ్రీనివాస్ నాయక్ స్టేట్ బ్యూరో
నిజం న్యూస్



