కొలంబియాలో భారీ భూకంపం.. 111 మంది మృతి! వందలాది భవనాలు నేలమట్టం
స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:34 గంటలకు భూకంపం సంభవించింది. పశ్చిమ కొలంబియాలోని చోకో ప్రాంతంలోని శాన్ జోస్ డెల్ పాల్మర్ సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

కొలంబియా, ఆగస్టు 11, 2026 | నిజం న్యూస్: పశ్చిమ కొలంబియాలో సోమవారం ఉదయం భారీ భూకంపం బీభత్సం సృష్టించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ప్రకంపనల ధాటికి పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలడంతో ఇప్పటివరకు 111 మంది ప్రాణాలు కోల్పోగా.. 87 మంది గాయపడ్డారు. వందలాది భవనాలు దెబ్బతిన్నాయి.
స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:34 గంటలకు భూకంపం సంభవించింది. పశ్చిమ కొలంబియాలోని చోకో ప్రాంతంలోని శాన్ జోస్ డెల్ పాల్మర్ సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సుమారు 107 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినప్పటికీ, దాని ప్రభావం విస్తృతంగా కనిపించింది. కాలి, క్విబ్డో, పెరీరా, అర్మేనియా, మనిజలెస్ తదితర నగరాల్లో భవనాలు దెబ్బతిన్నాయి.
మూడు రోజుల క్రితమే అధ్యక్షుడిగా బాధ్యతలు..
ఈ విపత్తు సమయంలో కొలంబియా అధ్యక్షుడు అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లా బాధ్యతలు చేపట్టి కేవలం మూడు రోజులు మాత్రమే అయింది. ఆగస్టు 7న ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించగా.. ఆ వెంటనే దేశాన్ని భారీ భూకంపం కుదిపేసింది.
భూకంపం అనంతరం అధ్యక్షుడు డి లా ఎస్ప్రియెల్లా జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించి, సహాయక చర్యలను వేగవంతం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించాలని అధికారులను ఆదేశించారు. భద్రతా బలగాలను కూడా సహాయక చర్యల్లోకి దించారు.
శిథిలాల కింద చిక్కుకున్న బాధితులు
భూకంపం ధాటికి అనేక భవనాలు కూలిపోవడంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. రెస్క్యూ బృందాలు రాత్రింబవళ్లు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన వారిని రక్షించిన ఘటనలు కూడా నమోదయ్యాయి.
ఈ శతాబ్దంలో కొలంబియాలోనే అత్యంత బలమైన భూకంపం
7.4 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ఈ శతాబ్దంలో కొలంబియాను తాకిన అత్యంత బలమైన భూకంపంగా Reuters నివేదించింది. ప్రధాన భూకంపం తర్వాత 21 ప్రకంపనలు (ఆఫ్టర్షాక్స్) నమోదయ్యాయని, మరిన్ని ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
భూకంప ప్రకంపనలు పొరుగున ఉన్న ఈక్వెడార్తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ నమోదయ్యాయి. ప్రభావిత ప్రాంతాల్లో విమానాశ్రయాలను తనిఖీల కోసం తాత్కాలికంగా మూసివేశారు. కొన్ని ప్రాంతాల్లో భద్రతా కారణాలతో ఆంక్షలు విధించారు.
ప్రస్తుతం కొలంబియాలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగిస్తూ ప్రాణాలతో ఉన్నవారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
-శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో,నిజం న్యూస్



