వివాహేతర సంబంధం కోసం భర్త హత్య.. ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం విఫలం
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను దారుణంగా హత్య చేసి, అనంతరం ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేసిన ఘటన హైదరాబాద్లోని ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.

హైదరాబాద్, జూన్ 23 (నిజం న్యూస్ – స్టేట్ బ్యూరో)
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను దారుణంగా హత్య చేసి, అనంతరం ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేసిన ఘటన హైదరాబాద్లోని ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన బోడ నర్సింగ్ (33)కు స్వరూపతో 2008లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఉపాధి నిమిత్తం నర్సింగ్ ఇటీవల హైదరాబాద్లోని ఎల్బీనగర్ ఎన్టీఆర్ నగర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇదే సమయంలో స్వరూపకు స్వగ్రామానికి చెందిన మోహన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం నర్సింగ్కు తెలియడంతో గత కొంతకాలంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ కూడా జరిగినట్లు సమాచారం.
గత మూడు రోజులుగా తీవ్ర స్థాయిలో విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో భర్తను హత్య చేయాలని స్వరూప నిర్ణయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. శనివారం రాత్రి మరోసారి జరిగిన గొడవ అనంతరం ఇంట్లో ఏకాంతంగా ఉన్న సమయంలో నర్సింగ్పై దాడి చేసి చున్నీతో గొంతు బిగించి హత్య చేసినట్లు విచారణలో తేలింది.
అనంతరం ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని మంచానికి చున్నీతో కట్టి ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. తర్వాత డయల్-100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
అయితే నర్సింగ్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అతని అన్న బిచ్యానాయక్ ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసును లోతుగా విచారించారు. పోస్టుమార్టం నివేదికతో పాటు సాంకేతిక ఆధారాల పరిశీలనలో ఇది ఆత్మహత్య కాదని, హత్యేనని నిర్ధారణ అయింది.
దర్యాప్తులో భాగంగా స్వరూప భర్తను హత్య చేసిన అనంతరం తన ప్రియుడికి ఫోన్ చేసి పరారయ్యే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందం ఆమెను అల్కాపురి ప్రాంతంలో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. అనంతరం ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
మృతుడు నర్సింగ్ దంపతుల పెద్ద కుమార్తె ఇటీవల వరంగల్ గురుకుల పాఠశాలలో పదో తరగతి పూర్తి చేయగా, చిన్న కుమార్తె హయత్నగర్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధాల కారణంగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
— శ్రీనివాస్ నాయక్, స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



