పెద్ది కుటుంబానికి పెద్దదిక్కుగా కేసీఆర్.. రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం
పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో రూ.1 కోటి చొప్పున మొత్తం రూ.2 కోట్ల ఆర్థిక సహాయం అందించనున్నారు.

నిజం న్యూస్ | హైదరాబాద్, ఆగస్టు 8, 2026
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలవాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. పెద్ది కుటుంబానికి ఆపన్నహస్తం అందించేందుకు మొత్తం రూ.2.25 కోట్ల ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు.
పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో రూ.1 కోటి చొప్పున మొత్తం రూ.2 కోట్ల ఆర్థిక సహాయం అందించనున్నారు.
అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి శ్రీమతి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉన్న నేపథ్యంలో ఆమె భవిష్యత్ అవసరాలు, బాగోగుల కోసం మరో రూ.25 లక్షలను ఆమె పేరుతో బ్యాంకులో జమ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.
దీంతో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున మొత్తంగా రూ.2.25 కోట్ల ఆర్థిక సహాయం అందనుంది. కుటుంబం కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీ అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పిల్లల భవిష్యత్తుకు పార్టీ అండ
ఆర్థిక సహాయంతో మాత్రమే పార్టీ బాధ్యత ముగియదని కేసీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం. పెద్ది సుదర్శన్ రెడ్డి పిల్లల భవిష్యత్తు, వారి చదువులు, కుటుంబ సంక్షేమానికి సంబంధించిన అంశాలను పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.
పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని, కుటుంబ సభ్యులకు అవసరమైన సమయంలో పార్టీ నాయకత్వం తోడుగా నిలుస్తుందని కేసీఆర్ భరోసా ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
శ్రీనివాస్ నాయక్ స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



