వర్షాల కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. 10న నాగార్జునసాగర్లో వరుణ యాగం
వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రంలోని నదులు, చెరువులు జలకళను సంతరించుకోవడంతో పాటు పాడిపంటలు సమృద్ధిగా పండాలని సంకల్పిస్తూ నాగార్జునసాగర్లో వరుణ యాగం నిర్వహించనున్నారు.

నిజం న్యూస్ | ఆగస్టు 7, 2026
హైదరాబాద్: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రంలోని నదులు, చెరువులు జలకళను సంతరించుకోవడంతో పాటు పాడిపంటలు సమృద్ధిగా పండాలని సంకల్పిస్తూ నాగార్జునసాగర్లో వరుణ యాగం నిర్వహించనున్నారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు, వేదపండితులు, సిద్ధాంతులు నిర్ణయించిన ముహూర్తం మేరకు ఈ నెల 10వ తేదీన వరుణ యాగం నిర్వహించనున్నారు. నాగార్జునసాగర్ డ్యామ్ తీరంలోని విజయవిహార్ ప్రాంగణంలో యాగం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేదపండితులు నిర్ణయించిన ముహూర్తంలో యాగ క్రతువులను నిర్వహించనున్నారు. కృష్ణా, గోదావరి నదులు, చెరువులు జలకళను సంతరించుకోవాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని సంకల్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సారథ్యంలో వరుణ యాగం జరగనుంది. యాగం అనంతరం నిర్వహించే మహత్తర పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో – నిజం న్యూస్



