రూ.20 వేల లంచం స్వీకరిస్తూ ఏసీబీకి చిక్కిన జిల్లా భూగర్భ జలాల అధికారి..
బోర్వెల్ డ్రిల్లింగ్ రిగ్కు అనుమతి మంజూరు చేయడంతో పాటు, అనవసర జరిమానాలు విధించకుండా, రిగ్ను స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు రూ.20,000 లంచం డిమాండ్ చేశారు. జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి సూచన మేరకు డేటా ఎంట్రీ ఆపరేటర్ లంచం మొత్తాన్ని స్వీకరిస్తుండగా నల్గొండ రేంజ్ ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని పట్టుకున్నారు.

డేటా ఎంట్రీ ఆపరేటర్ అరెస్ట్
నిజం న్యూస్
హైదరాబాద్, జూలై 15:
సూర్యాపేట జిల్లా భూగర్భ జలాల శాఖలో అవినీతి బాగోతం వెలుగుచూసింది. జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ (AO-1) మేఘావత్ బాలు, ఔట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ (AO-2) కొసనోజు వెంకటేశ్వర్లును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం రూ.20 వేల లంచం స్వీకరిస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడి బోర్వెల్ డ్రిల్లింగ్ రిగ్కు అనుమతి మంజూరు చేయడంతో పాటు, అనవసర జరిమానాలు విధించకుండా, రిగ్ను స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు రూ.20,000 లంచం డిమాండ్ చేశారు. జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి సూచన మేరకు డేటా ఎంట్రీ ఆపరేటర్ లంచం మొత్తాన్ని స్వీకరిస్తుండగా నల్గొండ రేంజ్ ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని పట్టుకున్నారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ వద్ద నుంచి రూ.20 వేల లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు, ఇద్దరూ అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమ లాభం పొందేందుకు కుట్ర పన్నినట్లు గుర్తించారు.
నిందితులను నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఎదుట రిమాండ్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ వెల్లడించింది.
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినా లేదా స్వీకరించినా వెంటనే ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
-శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



