12 ఏళ్ల బాలుడిని లాక్కెళ్లిన మొసలి..
గురువారం (16 జూలై 2026) వరి నాట్లు వేసిన అనంతరం కాళ్లు, చేతులు కడుక్కోవడానికి సమీపంలోని నదిలోకి దిగిన 12 ఏళ్ల బాలుడిపై మొసలి ఒక్కసారిగా దాడి చేసింది.

కాళ్లు, చేతులు కడుక్కోవడానికి నదిలోకి దిగిన 12 ఏళ్ల బాలుడిని సజీవంగా లాక్కెళ్లిన మొసలి..
17 జూలై 2026 | నిజం న్యూస్
ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రాయిచ్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గురువారం (16 జూలై 2026) వరి నాట్లు వేసిన అనంతరం కాళ్లు, చేతులు కడుక్కోవడానికి సమీపంలోని నదిలోకి దిగిన 12 ఏళ్ల బాలుడిపై మొసలి ఒక్కసారిగా దాడి చేసింది.
బాలుడిని తన బలమైన దవడలతో పట్టుకున్న మొసలి నీటిలోకి లాక్కెళ్లి పలుమార్లు తిప్పుతూ (“డెత్ రోల్”) దాడి చేసింది. బాలుడి కేకలు విని అక్కడికి చేరుకున్న గ్రామస్తులు కర్రలు, రాళ్లు విసురుతూ మొసలిని తరిమేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు మొసలి బాలుడిని నీటిలోకి తీసుకెళ్లిపోయింది.
సమాచారం అందుకున్న అటవీశాఖ, పోలీసులు, స్థానిక అధికారులు గ్రామస్తులతో కలిసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు ఐదు గంటల తర్వాత బాలుడి ఛిద్రమైన మృతదేహాన్ని వెలికితీశారు. మొసలి బాలుడి కాళ్లు, పొట్ట భాగాన్ని తీవ్రంగా దెబ్బతీసినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. బహ్రాయిచ్ జిల్లాలోని ఘాఘ్రా నది పరివాహక ప్రాంతాల్లో మొసళ్ల సంచారం అధికంగా ఉండటంతో నదులు, కాలువల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సూచించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
— శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



