రైతులను నిలువునా దోచేస్తున్న ఎరువుల మాఫియా
మాడ్గుల మండల పరిధిలో పలు ఎరువుల దుకాణాలలో రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని యూరియా,డీఏపీ, 28:28: ఎరువుల తో పాటు వివిధ రకాల పురుగుమందులను నిర్ణీత ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

మాడ్గుల,జులై 31నిజం చెపుతాం:
మాడ్గుల మండల పరిధిలో పలు ఎరువుల దుకాణాలలో రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని యూరియా,డీఏపీ, 28:28: ఎరువుల తో పాటు వివిధ రకాల పురుగుమందులను నిర్ణీత ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఇందుకు సంబంధించిన బిల్లులు ధరల వివరాలు ఇతర ఆధారాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు.పంటను కాపాడుకోవాలంటే తప్పనిసరిగా ఎరువులు కొనాల్సిందేనని తెలిసినా, కొందరు దుకాణాల నిర్వాహకులు రైతుల నిస్సహాయతను అవకాశంగా మార్చుకుని ఒక్కో బస్తాపై అదనంగా వసూలు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైతు చెమటను సొమ్ముగా మార్చుకునే ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు మాత్రం మౌనంగా ఉండడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం,ఆధారాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు తనిఖీలు,కేసులు,లైసెన్స్లపై చర్యలు కనిపించకపోవడంపై మండల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రైతులను దోచుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవడంలో వ్యవసాయ శాఖ ఎందుకు విఫలమవుతోంది? ఈ నిర్లక్ష్యానికి బాధ్యత ఎవరిది? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.జిల్లా ఉన్నతాధికారులు వెంటనే ప్రత్యేక విచారణకు ఆదేశించి అధిక ధరలకు ఎరువులు విక్రయించిన దుకాణాల లైసెన్స్లను రద్దు చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అదే విధంగా విధులలో నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారుల బాధ్యతను కూడా నిర్ధారించాలని కోరుతున్నారు.ఈ అంశంపై సంబంధిత ఎరువుల దుకాణాల నిర్వాహకులు,వ్యవసాయ శాఖ అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది.



