షాబాద్ ఆరు హత్యల కేసుకు ముగింపు.. ప్రధాన నిందితుడు రాజ్కుమార్ మృతి
పెంజర్ల గ్రామ శివారులో మృతదేహం గుర్తింపు.. పక్కనే గడ్డి మందు లభ్యం.. 8 ప్రత్యేక పోలీసు బృందాల గాలింపుకు తెర

రంగారెడ్డి జిల్లా | జూలై 13 | నిజం న్యూస్
రంగారెడ్డి జిల్లా షాబాద్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్కుమార్ మృతిచెందాడు. షాద్నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ శివారులో సోమవారం అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
స్థానికులు అనుమానాస్పద స్థితిలో మృతదేహాన్ని గమనించి వెంటనే డయల్-100కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం సమీపంలో గడ్డి మందు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. దీంతో రాజ్కుమార్ గడ్డి మందు సేవించి మృతి చెందినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణాలపై అధికారిక స్పష్టత రానుంది.
గత శుక్రవారం రాత్రి షాబాద్ మండలంలో జరిగిన ఈ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. తనపై పోక్సో కేసు నమోదు చేయించారనే కక్షతో రాజ్కుమార్ మొదట బాలిక, ఆమె తల్లి, నానమ్మను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం తన ఇంటికి వెళ్లి భార్య సరిత, ఇద్దరు కుమారులను కూడా హత్య చేసి అక్కడి నుంచి పరారైనట్లు దర్యాప్తులో వెల్లడైంది.
నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఏకంగా 8 ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించి పలు ప్రాంతాల్లో ముమ్మరంగా వెతికారు. చివరకు కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ శివారులో రాజ్కుమార్ మృతదేహం లభ్యమవడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.
ఘటనాస్థలంలో ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరించగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ పరీక్షలు, ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో | నిజం న్యూస్



