భూపాల్ నాయక్ చీటర్.. ముందే చెప్పాం: బోడ రమేష్ నాయక్
మూడేళ్ల క్రితమే ప్రజలను హెచ్చరించామని ఎల్హెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడి వ్యాఖ్య

మహబూబాబాద్, జూన్ 18 (నిజం న్యూస్):
కిసాన్ పరివార్ అధినేత నానావత్ భూపాల్ నాయక్ వ్యవహారాలపై తాము మూడేళ్ల క్రితమే ప్రజలను హెచ్చరించామని ఎల్హెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ తెలిపారు. భూపాల్ నాయక్ అరెస్టు నేపథ్యంలో గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పలు ఆరోపణలు చేశారు.
గత మూడు సంవత్సరాల క్రితం నానావత్ భూపాల్ నాయక్ కిసాన్ పరివార్ అధినేతగా చెప్పుకుంటూ మహబూబాబాద్ గిరిజన జిల్లాలోని డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల పరిధిలోని గిరిజన అమాయక ప్రజల ఆధార్ కార్డులు సేకరించి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడని ఆరోపించారు. అలాగే కిసాన్ పరివార్ అనే సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి అనేక మంది అమాయక ప్రజల నుంచి భారీ మొత్తంలో పెట్టుబడులు సేకరించాడని పేర్కొన్నారు.
భూపాల్ నాయక్కు భారతదేశ ఓటరు గుర్తింపు కార్డు కూడా లేదని, అయినప్పటికీ ప్రజలను మోసం చేస్తూ పెద్దఎత్తున డబ్బులు సేకరించాడని బోడ రమేష్ నాయక్ విమర్శించారు. గతంలో చిన్నగూడూరు మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో భూపాల్ నాయక్ కార్యకలాపాలను ప్రశ్నించిన సందర్భంలో తమపై దాడి జరిగిందని, అయినప్పటికీ ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశామని తెలిపారు.
గిరిజన జిల్లాలో ప్రజలను మోసం చేసి వ్యక్తిగత విలాసాల కోసం సంపాదించిన డబ్బును వినియోగించాడని ఆరోపించిన ఆయన, గిరిజన ప్రాంత ప్రజలు అమాయకులే కానీ అవగాహన లేనివారు కాదన్నారు. నాయకుల గత చరిత్రను పరిశీలించి తగిన సమయంలో ప్రజలే తీర్పు చెబుతారని తాము అప్పుడే హెచ్చరించినట్లు గుర్తు చేశారు.
భూపాల్ నాయక్పై దేశీయంగానే కాకుండా విదేశాల్లో కూడా పలు ఆర్థిక అక్రమాల ఆరోపణలు ఉన్నాయని, ప్రస్తుతం అవన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. చేసిన కర్మ ఫలితంగానే నేడు చట్టం ముందు నిలబడి జైలు పాలయ్యాడని వ్యాఖ్యానించారు.
భూపాల్ నాయక్ కారణంగా నష్టపోయిన బాధితులందరికీ న్యాయం చేయాలని, వారి పెట్టుబడులు తిరిగి అందేలా ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని బోడ రమేష్ నాయక్ డిమాండ్ చేశారు.
– శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



