ఆపరేషన్ సిందూర్ అమర వీరులకు వందనం.. ఏడాది తర్వాత ఆరుగురు వీర జవాన్ల పేర్లు వెల్లడించిన కేంద్రం
పాకిస్థాన్ ప్రేరేపిత దాడులకు భారత సైన్యం ధీటుగా ప్రతిస్పందించిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా అమరులైన ఆరుగురు జవాన్ల వివరాలను కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా వెల్లడించింది.

నిజం న్యూస్, జూన్ 27, 2026
పాకిస్థాన్ ప్రేరేపిత దాడులకు భారత సైన్యం ధీటుగా ప్రతిస్పందించిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా అమరులైన ఆరుగురు జవాన్ల వివరాలను కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా వెల్లడించింది. జాతీయ యుద్ధ స్మారక వెబ్సైట్లోని గౌరవ పట్టికలో వీరి పేర్లను నమోదు చేయడంతో పాటు, న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నంలోని 3డీ వాల్పై కూడా శాశ్వతంగా పొందుపరిచింది.
అమరులైన వారిలో భారత సైన్యానికి చెందిన సుబేదార్ మేజర్ పవన్ కుమార్, రైఫిల్మ్యాన్ సునీల్ కుమార్, లాన్స్ నాయక్ దినేశ్ కుమార్, హవల్దార్ సునీల్ కుమార్ సింగ్, వైమానిక సాంకేతిక నిపుణుడు మూడ్ మురళీనాయక్, అలాగే భారత వైమానిక దళానికి చెందిన సార్జంట్ సురేంద్ర కుమార్ ఉన్నారు.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో ఉగ్రవాద మౌలిక స్థావరాలపై కచ్చితమైన దాడులు నిర్వహించి దేశ భద్రత పట్ల తమ సంకల్పాన్ని చాటాయి. ఈ ఆపరేషన్లో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ల సేవలను దేశం ఎప్పటికీ మరువదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అమరుల త్యాగం భారత సైనికుల ధైర్యసాహసాలకు చిరస్మరణీయ నిదర్శనంగా నిలిచిపోతుందని అధికారులు తెలిపారు.
— శ్రీనివాస్ నాయక్ స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



