AIతో 121 నకిలీ బ్యాంకింగ్ యాప్లు.. ₹64.38 కోట్ల సైబర్ దోపిడీ..
18 ఏళ్ల వయస్సు, 11వ తరగతి చదివి మధ్యలోనే చదువు మానేసిన ఉత్తరప్రదేశ్కు చెందిన రోహిత్ వీరేంద్రసింగ్ శాక్య అనే యువకుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), యూట్యూబ్ ట్యుటోరియల్స్ సహాయంతో నకిలీ బ్యాంకింగ్, ప్రభుత్వ సేవల యాప్లను రూపొందించి కోట్ల రూపాయల సైబర్ మోసానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

18 ఏళ్ల డ్రాపౌట్ యువకుడి అంతరాష్ట్ర మోసం బట్టబయలు
జూలై 22, 2026 | నిజం న్యూస్
గుజరాత్లోని సూరత్ సైబర్ క్రైమ్ పోలీసులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ అంతరాష్ట్ర సైబర్ మోసాన్ని ఛేదించారు. కేవలం 18 ఏళ్ల వయస్సు, 11వ తరగతి చదివి మధ్యలోనే చదువు మానేసిన ఉత్తరప్రదేశ్కు చెందిన రోహిత్ వీరేంద్రసింగ్ శాక్య అనే యువకుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), యూట్యూబ్ ట్యుటోరియల్స్ సహాయంతో నకిలీ బ్యాంకింగ్, ప్రభుత్వ సేవల యాప్లను రూపొందించి కోట్ల రూపాయల సైబర్ మోసానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
సూరత్ పోలీసులు కాన్పూర్లోని ఓ హోటల్లో రోహిత్ శాక్యను అరెస్ట్ చేశారు. విచారణలో అతను AI టూల్స్, యూట్యూబ్ వీడియోల ద్వారా స్వయంగా కోడింగ్ నేర్చుకుని ఈ సైబర్ నెట్వర్క్ను నిర్మించినట్లు గుర్తించారు.
పోలీసుల దర్యాప్తులో మొత్తం 121 నకిలీ APK యాప్లు వెలుగులోకి వచ్చాయి. వీటిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), యాక్సిస్ బ్యాంక్, ఆర్టీఓ చలాన్, పీఎం-కిసాన్ వంటి ప్రముఖ బ్యాంకులు, ప్రభుత్వ పథకాల పేర్లతో రూపొందించారు.
దేశవ్యాప్తంగా 21,672 మొబైల్ ఫోన్లలో ఈ నకిలీ యాప్లు ఇన్స్టాల్ అయినట్లు అధికారులు గుర్తించారు. వాటిలో 2,928 మొబైల్ ఫోన్లు పూర్తిగా సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లాయి. బాధితుల ఖాతాల నుంచి 54,094 అనధికారిక బ్యాంకింగ్ లావాదేవీల ద్వారా సుమారు ₹64.38 కోట్లు కాజేసినట్లు దర్యాప్తులో తేలింది.
రోహిత్ రూపొందించిన మాల్వేర్ యాప్లను టెలిగ్రామ్ ద్వారా జార్ఖండ్లోని జామ్తారా, హర్యానా, రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో పనిచేసే సైబర్ ముఠాలకు విక్రయించేవాడు. ఒక్కో యాప్ లింక్ లేదా APK ఫైల్ యాక్టివ్గా ఉండేందుకు నెలకు రూ.15 వేల చొప్పున సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సైబర్ మోసంలో ప్రత్యేకంగా రెండు రకాల యాప్లను రూపొందించినట్లు విచారణలో వెల్లడైంది. ఒకటి బాధితులు ఇన్స్టాల్ చేసే “విక్టిమ్ యాప్”, మరొకటి సైబర్ నేరగాళ్లు ఉపయోగించే “అడ్మిన్ యాప్”. బాధితుల ఫోన్లకు వచ్చే OTPలు, బ్యాంకింగ్ వివరాలు, నోటిఫికేషన్లు నేరుగా అడ్మిన్ యాప్లో కనిపించేలా ఈ వ్యవస్థను రూపొందించడంతో నేరగాళ్లు సులభంగా బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
సూరత్కు చెందిన ఓ వ్యక్తి వాట్సాప్లో వచ్చిన నకిలీ “PNB One” యాప్ను ఇన్స్టాల్ చేయడంతో రూ.5 లక్షలు కోల్పోయాడు. అనంతరం అతడు జాతీయ సైబర్ హెల్ప్లైన్ 1930కు ఫిర్యాదు చేయడంతో సూరత్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలను విశ్లేషించి ఈ అంతరాష్ట్ర సైబర్ నెట్వర్క్ను ఛేదించారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న డిజిటల్ ఆధారాల్లో అనేక డొమైన్లు, సర్వర్లు, మాల్వేర్ కోడ్లు, టెలిగ్రామ్ ఛానల్ వివరాలు లభించినట్లు సమాచారం. ఈ కేసులో మరికొందరు సైబర్ నేరగాళ్ల ప్రమేయంపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రజలకు సైబర్ పోలీసుల హెచ్చరికలు:
వాట్సాప్, టెలిగ్రామ్, SMSల ద్వారా వచ్చే APK ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్స్టాల్ చేయవద్దు.
బ్యాంకింగ్ లేదా ప్రభుత్వ సేవలకు సంబంధించిన యాప్లను కేవలం Google Play Store లేదా Apple App Store నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి.
గుర్తు తెలియని లింకులను క్లిక్ చేయవద్దు.
OTPలు, బ్యాంకింగ్ వివరాలు, UPI PINలను ఎవరికీ చెప్పవద్దు.
అనుమానాస్పద లావాదేవీలు జరిగిన వెంటనే 1930 సైబర్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలి లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలి.
-శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



