ఎండల ఎఫెక్ట్: తెలంగాణలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి… ప్రజలు విలవిల
నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, నల్లగొండ, ఆదిలాబాద్, భద్రాద్రి, కొమురంభీం జిల్లాల్లో గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో భానుడు భగ్గుమంటూ ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు.
రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత అధికమవుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, నల్లగొండ, ఆదిలాబాద్, భద్రాద్రి, కొమురంభీం జిల్లాల్లో గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అదే విధంగా సిద్దిపేట, మెదక్, నారాయణపేట, నాగర్కర్నూలు, సూర్యాపేట, ములుగు, కరీంనగర్ జిల్లాల్లో 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరాయి.
ఇంకా ఖమ్మం, భూపాలపల్లి, హనుమకొండ, గద్వాల, సిరిసిల్ల, మహబూబాబాద్, మహబూబ్నగర్, వరంగల్ ప్రాంతాల్లో కూడా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రంగారెడ్డి, వనపర్తి, యాదాద్రి, మేడ్చల్ జిల్లాల్లో 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను వేధిస్తున్నాయి.
ఈ తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లడాన్ని తగ్గించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకుండా ఉండడం, నీరు ఎక్కువగా తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం అవసరమని చెబుతున్నారు.



