అభ్యర్థులకు టీజీపీఎస్సీ అలర్ట్: రేపే ఓటీఆర్ అప్డేట్కు చివరి గడువు..!
ప్రకటించిన గడువు మార్చి 25 (బుధవారం) తో ముగియనుంది. అభ్యర్థులు తమ వ్యక్తిగత, విద్యా అర్హత వివరాలను సరిచూసుకునేందుకు ఇదే చివరి అవకాశమని కమిషన్ స్పష్టం చేసింది.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఉద్యోగ అభ్యర్థులకు కీలక సూచన చేసింది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) వివరాలను అప్డేట్ చేసుకోవడానికి ప్రకటించిన గడువు మార్చి 25 (బుధవారం) తో ముగియనుంది. అభ్యర్థులు తమ వ్యక్తిగత, విద్యా అర్హత వివరాలను సరిచూసుకునేందుకు ఇదే చివరి అవకాశమని కమిషన్ స్పష్టం చేసింది.
- ముగియనున్న గడువు.. పొడిగింపు లేనట్టే..!
గతంలో ఫిబ్రవరి 25 వరకు ఉన్న గడువును అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు కమిషన్ నెల రోజుల పాటు అంటే మార్చి 25 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే, రేపటితో ఈ గడువు ముగియనుండటంతో అభ్యర్థులు అప్రమత్తమవ్వాలి. ఇకపై గడువు పొడిగించే ప్రసక్తే లేదని, ఈసారి అప్డేట్ చేయని అభ్యర్థులు భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవడం కష్టతరమవుతుందని అధికారులు హెచ్చరించారు.
ఎస్సీ (SC) వర్గీకరణ మరియు కొత్త జిల్లాల ప్రాతిపదికన వివరాలను సరిచేసుకోవడం తప్పనిసరి.అభ్యర్థులు తమ తాజా విద్యా అర్హతలు, కుల ధృవీకరణ పత్రాలు మరియు ఫోటో, సంతకాలను కొత్తగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.భవిష్యత్తులో అభ్యర్థులు దరఖాస్తు చేసేటప్పుడు ఓటీఆర్లో ఉన్న వివరాలే ప్రామాణికంగా తీసుకోబడతాయి. ఏవైనా తప్పులు ఉంటే దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.
గడువు ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో వెబ్సైట్పై ఒత్తిడి పెరిగి సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు లాగిన్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. కాబట్టి, చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే https://www.tgpsc.gov.in వెబ్సైట్లోకి వెళ్లి వివరాలను సరిచేసుకోవాలని కమిషన్ కోరింది.



