నాకు అమ్మానాన్న లేరు.. మీరే నా దేవుడు”: పరీక్షా పత్రంలో విద్యార్థి ఆవేదన..!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్..!

ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల మూల్యాంకన కేంద్రాల్లో తరచుగా వింత వింత సంఘటనలు వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా ఒక విద్యార్థి తన ఆన్సర్ షీట్లో రాసిన భావోద్వేగ పూరితమైన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇంటర్మీడియట్ పేపర్ల దిద్దుబాటు ప్రక్రియలో నిమగ్నమైన అధ్యాపకులకు ఒక వింత అనుభవం ఎదురైంది. ఒక విద్యార్థి సమాధానాలు రాయాల్సిన చోట తన దీనగాథను వివరిస్తూ పాస్ చేయమని వేడుకున్నాడు.
సార్, నాకు అమ్మా నాన్న లేరు. ఈ లోకంలో నాకు ఎవరూ లేరు, మీరే నాకు అమ్మా నాన్న అనుకుంటున్నాను. నేను చదువుకున్న ప్రశ్నలు ఏవీ పరీక్షలో రాలేదు. దయచేసి నన్ను పాస్ చేయండి సార్. దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను.. ప్రస్తుతానికి మీరే నా దేవుడు.
సాధారణంగా విద్యార్థులు పరీక్షల్లో సమాధానాలు రాకపోయినా, ఉత్తీర్ణత సాధించాలనే తపనతో ఇలాంటి లేఖలు రాస్తుంటారు. కొందరు డబ్బులు పెట్టి ప్రలోభపెట్టాలని చూస్తే, మరికొందరు తమ కష్టాలను వివరిస్తూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తారు.
ఈ లేఖను చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.ఆ విద్యార్థి పరిస్థితి నిజంగానే జాలి కలిగించేలా ఉందని, మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరుతున్నారు.
చదువు పట్ల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి పరిస్థితి వస్తుందని, ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే విద్యా వ్యవస్థ దెబ్బతింటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
బోర్డు నిబంధనల ప్రకారం, సమాధాన పత్రాలపై ఇలాంటి వ్యక్తిగత విజ్ఞప్తులు రాయడం నిషిద్ధం. ఇలా రాసిన విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. మూల్యాంకనం చేసే అధ్యాపకులు కేవలం రాసిన సమాధానాలకు మాత్రమే మార్కులు వేయాల్సి ఉంటుంది తప్ప, ఇలాంటి విజ్ఞప్తులకు మార్కులు వేసే అధికారం వారికి ఉండదు.



