దేశంలోనే మొట్టమొదటిసారిగా గాలి నాణ్యత సూచిక సౌకర్యం కలిగిన ప్రత్యేక బస్సు సేవలు అందుబాటులోకి
పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించిన సమయంలో ఈ బస్సులు ప్రయాణ కాలంలో దాదాపు తొంభై శాతం సమయం గాలి నాణ్యతను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉంచగలిగాయి.

తొలిసారిగా గాలి నాణ్యత సూచిక సౌకర్యం కలిగిన ప్రత్యేక బస్సు సేవలు ప్రారంభం
విజయవాడ నుండి బెంగళూరు నగరానికి ప్రయాణించే ప్రయాణికుల కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా గాలి నాణ్యత సూచిక సౌకర్యం కలిగిన ప్రత్యేక బస్సు సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఇంట్రసిటీ స్మార్ట్ బస్ సంస్థ ఈ వినూత్న సాంకేతికతను తన బస్సుల్లో ప్రవేశపెట్టింది. విజయవాడ నగర ట్రాఫిక్ పోలీస్ ఉప కమిషనర్ షెరీన్ బేగం ఈ సేవలను అధికారికంగా ప్రారంభించారు.
సాధారణంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో బస్సు లోపల గాలి కాలుష్యం బయటి వాతావరణం కంటే రెండు నుండి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని అనేక శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడించాయి.
ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించి ప్రయాణికులకు స్వచ్ఛమైన గాలిని అందించడమే ఈ నూతన ప్రక్రియ ప్రధాన ఉద్దేశం. ఈ బస్సుల్లో అత్యాధునిక వాయు శుద్ధీకరణ యంత్రాలను అమర్చారు.
ఇవి గాలిలోని అతి సూక్ష్మమైన ధూళి కణాలు, వాహనాల నుండి వచ్చే కర్బన ఉద్గారాలు, ఇతర హానికరమైన కలుషిత పదార్థాలను నిరంతరం శుద్ధి చేస్తూ ఉంటాయి.
పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించిన సమయంలో ఈ బస్సులు ప్రయాణ కాలంలో దాదాపు తొంభై శాతం సమయం గాలి నాణ్యతను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉంచగలిగాయి.
ముఖ్యంగా వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లో కూడా బస్సు లోపల గాలి అత్యంత ఆరోగ్యకరంగా ఉండేలా ఈ సాంకేతికత తోడ్పడుతుంది.
ప్రయాణికులు తమ ప్రయాణ సమయంలో గాలి ఏ స్థాయిలో ఉందో స్వయంగా చూసే వీలు కల్పించారు. బస్సు లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిజిటల్ తెరల మీద గాలి నాణ్యత సూచిక, పీఎం 2.5 స్థాయిలు ఎప్పటికప్పుడు కనిపిస్తూ ఉంటాయి.
దీనివల్ల ప్రయాణికులు తాము ఎంత స్వచ్ఛమైన గాలిని పీలుస్తున్నారో తెలుసుకోవచ్చు. దీనికి తోడు ప్రయాణికులు తమ చరవాణిలోని ఇంట్రసిటీ యాప్ ద్వారా కూడా ఈ వివరాలను పర్యవేక్షించవచ్చు. శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడేవారు,
చిన్న పిల్లలు, వయసు పైబడిన వారికి ఈ సౌకర్యం ఎంతో మేలు చేస్తుంది. విజయవాడ నగరం దక్షిణ భారతదేశంలో ఒక ప్రముఖ రవాణా కేంద్రంగా పేరుగాంచింది.
ఇక్కడి నుండి కర్ణాటక రాజధాని బెంగళూరుకు ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు ప్రయాణిస్తుంటారు. సుమారు పది నుండి పన్నెండు గంటల పాటు సాగే ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రయాణికుల ఆరోగ్యాన్ని కాపాడటం ఎంతో ముఖ్యం.
రవాణా రంగంలో ఇటువంటి ఆధునిక మార్పులు రావడం ప్రయాణ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. భవిష్యత్తులో ఇటువంటి వసతులను హైదరాబాద్, చెన్నై వంటి ఇతర ప్రధాన నగరాలకు నడిచే బస్సులకు కూడా విస్తరించాలని సదరు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
పర్యావరణ హితమైన ప్రయాణ విధానాలను ప్రోత్సహించడంలో భాగంగా ప్రైవేటు రవాణా సంస్థలు తీసుకుంటున్న ఇటువంటి చర్యలు అభినందనీయం.
ప్రస్తుతం విజయవాడ-బెంగళూరు మార్గంలో ప్రయాణించే వారు తమ ప్రయాణ టికెట్లను బుక్ చేసుకునే సమయంలో స్మార్ట్బస్ ఏక్యూఐ గుర్తున్న బస్సులను ఎంచుకోవడం ద్వారా ఈ సౌకర్యాలను పొందవచ్చు.
సాధారణ బస్సుల్లో ఉండే ఉక్కపోత, కలుషిత గాలి వంటి ఇబ్బందులు లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. రవాణా వ్యవస్థ అంటే కేవలం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి చేర్చడమే కాకుండా ప్రయాణికుల క్షేమాన్ని కూడా బాధ్యతగా తీసుకోవాలని ఈ వినూత్న ప్రయోగం నిరూపిస్తోంది.
సాంకేతికతను ప్రజా సౌకర్యార్థం వినియోగించడంలో ఈ బస్సు సేవలు ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. ప్రయాణికులు కూడా ఇటువంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకోవడం వల్ల మెరుగైన సేవల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
కాలుష్య రహిత ప్రయాణం ప్రతి ఒక్కరి హక్కు అనే దిశగా ఈ అడుగులు పడుతున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ వంటి ప్రభుత్వ సంస్థలు కూడా భవిష్యత్తులో తమ ఏసీ బస్సుల్లో ఇటువంటి వాయు శుద్ధీకరణ వ్యవస్థలను ప్రవేశపెట్టే అవకాశం ఉందని రవాణా నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ బస్సుల్లో గాలి నాణ్యతను పెంచడమే కాకుండా లోపల ఉష్ణోగ్రతను కూడా ప్రయాణికులకు అనుకూలంగా ఉండేలా నియంత్రిస్తారు. రహదారి ప్రయాణాల్లో అలసట కలగకుండా ఉండటానికి శుభ్రమైన గాలి ఎంతో అవసరం.
ఈ సౌకర్యంతో కూడిన ప్రయాణం వల్ల ప్రయాణికులు గమ్యం చేరిన తర్వాత కూడా ఉత్సాహంగా ఉండగలుగుతారు.
(సి.హెచ్.ప్రతాప్)



