వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం.. ట్రంప్ లోపల ఉండగానే …
ప్రాథమిక సమాచారం ప్రకారం, పెన్సిల్వేనియా అవెన్యూ సమీపంలోని భద్రతా చెక్పాయింట్ వద్ద సాయుధుడు తన సంచిలో నుంచి తుపాకీ తీసి కాల్పులు ప్రారంభించినట్లు చెబుతున్నారు. దీంతో అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఎదురుకాల్పులు జరిపారు. ఘటన సమయంలో వరుసగా పలుమార్లు కాల్పుల శబ్దాలు వినిపించాయని అక్కడున్న మీడియా ప్రతినిధులు పేర్కొన్నట్లు సమాచారం.

వాషింగ్టన్, మే 24: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలో శనివారం సాయంత్రం కాల్పుల ఘటన కలకలం రేపింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవనంలో ఉన్న సమయంలో భద్రతా తనిఖీ కేంద్రం వద్ద ఓ సాయుధ వ్యక్తి అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డాడని సమాచారం.
వెంటనే స్పందించిన అమెరికా రహస్య భద్రతా విభాగం అధికారులు ఎదురుకాల్పులు జరిపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ ఘటనలో నిందితుడు తీవ్రంగా గాయపడి అనంతరం మృతి చెందినట్లు సమాచారం. మరో వ్యక్తికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, పెన్సిల్వేనియా అవెన్యూ సమీపంలోని భద్రతా చెక్పాయింట్ వద్ద సాయుధుడు తన సంచిలో నుంచి తుపాకీ తీసి కాల్పులు ప్రారంభించినట్లు చెబుతున్నారు. దీంతో అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఎదురుకాల్పులు జరిపారు. ఘటన సమయంలో వరుసగా పలుమార్లు కాల్పుల శబ్దాలు వినిపించాయని అక్కడున్న మీడియా ప్రతినిధులు పేర్కొన్నట్లు సమాచారం.
ఘటన జరిగిన సమయంలో డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లోనే ఉన్నప్పటికీ ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. కాల్పుల అనంతరం కొంతసేపు వైట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి అప్రమత్త పరిస్థితులు అమలు చేసినట్లు సమాచారం. పాత్రికేయులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది.
భద్రతా లోపాలపై మళ్లీ చర్చకు దారి తీసిన ఘటన
ఇటీవలి కాలంలో డొనాల్డ్ ట్రంప్కు సంబంధించిన భద్రతా అంశాలు వరుసగా వార్తల్లో నిలుస్తుండటంతో అమెరికాలో మరోసారి భద్రతా వ్యవస్థలపై చర్చ మొదలైంది. గతంలో కూడా వైట్ హౌస్ సమీపంలో భద్రతా ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో తాజా ఘటనపై దర్యాప్తు సంస్థలు అన్ని కోణాల్లో విచారణ చేపట్టాయి. అయితే ఈ ఘటనకు విదేశీ కుట్రలు లేదా ఇతర దేశాలతో సంబంధం ఉందనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ వెలువడలేదు.



