గానకోకిల ఎస్. జానకి కన్నుమూత.. భారత సంగీత ప్రపంచానికి తీరని లోటు..!
1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో జన్మించిన ఎస్. జానకి, చిన్ననాటి నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకుని అనంతరం భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు.

హైదరాబాద్ ,నిజం న్యూస్ | జూలై 11, 2026
దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచాన్ని తన అపూర్వమైన గానమాధుర్యంతో దశాబ్దాల పాటు అలరించిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి కన్నుమూశారు. వయోభారంతో పాటు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్తతో భారతీయ సినీ సంగీత రంగం విషాదంలో మునిగిపోయింది.
1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో జన్మించిన ఎస్. జానకి, చిన్ననాటి నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకుని అనంతరం భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు అనేక భారతీయ భాషల్లో వేలాది పాటలు ఆలపించి కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.
ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానంలో వేలాది పాటలు పాడి “దక్షిణ భారత గానకోకిల”గా విశేష గుర్తింపు పొందారు. ఆమె గాత్ర మాధుర్యం, భావ వ్యక్తీకరణ, ప్రతి పాటలో ప్రాణం పోసే తీరు ఆమెను భారతీయ సంగీత ప్రపంచంలో చిరస్మరణీయంగా నిలిపాయి.
ఎస్. జానకి తన కెరీర్లో నాలుగు జాతీయ ఉత్తమ నేపథ్య గాయని అవార్డులు సహా అనేక రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్నారు. తెలుగు సినీ సంగీతానికి ఆమె చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని సంగీత ప్రముఖులు పేర్కొంటున్నారు.
ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కె.జే. యేసుదాస్, పి.బి. శ్రీనివాస్ వంటి దిగ్గజ గాయకులతో కలిసి ఆమె ఆలపించిన ఎన్నో గీతాలు నేటికీ సంగీతాభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. ఇళయరాజా, కె.వి. మహాదేవన్, ఎం.ఎస్. విశ్వనాథన్, చక్రవర్తి, రాజ్-కోటి, ఎం.ఎం. కీరవాణి తదితర ప్రముఖ సంగీత దర్శకులతో ఆమె చేసిన సంగీత ప్రయాణం చిరస్మరణీయంగా నిలిచింది.
ఎస్. జానకి మరణంతో భారతీయ సినీ సంగీత ప్రపంచం ఓ గొప్ప గాన దిగ్గజాన్ని కోల్పోయిందని సినీ, రాజకీయ ప్రముఖులు, సంగీత విద్వాంసులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆలపించిన మధుర గీతాలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని, ఆమె స్వరం ఎప్పటికీ అమరమని నివాళులర్పిస్తున్నారు.
-శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



