ముంబై మొహర్రం ఊరేగింపులో భారీ కుట్ర భగ్నం..! 15 వేల మందిని బలితీసుకోవాలన్న దురాలోచన విఫలం
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మొహర్రం ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని వేలాది మంది ప్రాణాలను బలితీసుకోవాలని పన్నిన భారీ కుట్రను పోలీసులు తమ అప్రమత్తతతో భగ్నం చేశారు. నొప్పి నివారణ మందుల పేరుతో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 14,900 జింక్ ఫాస్ఫైడ్ (ఎలుకల మందు) నింపిన క్యాప్సూల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

ముంబై, జూన్ 29 (నిజం న్యూస్):
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మొహర్రం ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని వేలాది మంది ప్రాణాలను బలితీసుకోవాలని పన్నిన భారీ కుట్రను పోలీసులు తమ అప్రమత్తతతో భగ్నం చేశారు. నొప్పి నివారణ మందుల పేరుతో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 14,900 జింక్ ఫాస్ఫైడ్ (ఎలుకల మందు) నింపిన క్యాప్సూల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం, పుణెకు చెందిన ఫయాజ్ ప్రేమ్జీ (39) అనే పెయింట్ వ్యాపారి గత రెండు వారాలుగా ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో ఉంటూ ఈ కుట్రకు ప్రణాళిక రచించాడు. ఆన్లైన్ ద్వారా సుమారు 30,000 ఖాళీ క్యాప్సూల్స్, 50 కిలోల జింక్ ఫాస్ఫైడ్ కొనుగోలు చేసి వాటిలో విషాన్ని నింపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మొహర్రం ఊరేగింపులో పాల్గొంటున్న వారికి ఇవి నొప్పి నివారణ మాత్రలని చెప్పి ఉచితంగా పంపిణీ చేశాడు.
ఈ క్రమంలో క్యాప్సూల్ తీసుకున్న కొందరు అస్వస్థతకు గురికావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, “కనీసం 15,000 మందిని చంపాలనుకున్నాను” అని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. సమయానికి స్పందించిన పోలీసుల కారణంగా భారీ ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు.
పోలీసులు నిందితుడు బస చేసిన గదిలో తనిఖీలు నిర్వహించి 14,900 విషపూరిత క్యాప్సూల్స్తో పాటు మరిన్ని ఖాళీ క్యాప్సూల్స్, విషపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పదార్థాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఈ ఘటనలో అస్వస్థతకు గురైన వారికి చికిత్స అందించగా ప్రస్తుతం వారు ప్రమాదం నుంచి బయటపడ్డారని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం బైకుల్లా పోలీసులు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఒక్కడే ఈ కుట్రకు పాల్పడ్డాడా? లేదా అతని వెనుక మరెవరైనా ఉన్నారా? విదేశీ ప్రయాణాలు, ఆర్థిక లావాదేవీలు, ఇతర సంబంధాలపై కూడా విచారణ కొనసాగుతోంది. ఉగ్రవాద కోణం సహా అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటన నేపథ్యంలో ముంబైలో అన్ని ప్రధాన మతపరమైన, ప్రజా కార్యక్రమాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. భారీ జనసమూహాల్లో అపరిచితులు ఇచ్చే ఆహారం, మందులు లేదా ఇతర వస్తువులను స్వీకరించవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. ప్రజల అప్రమత్తతతో పాటు పోలీసుల వేగవంతమైన చర్యల వల్లే పెను విషాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు.
– శ్రీనివాస్ నాయక్, స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



