ఆరుగురి హత్య కేసులో కీలక చర్య.. షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెన్షన్
విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో షాబాద్ సీఐ క్రాంతి రెడ్డిని సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

పరారీలో ఉన్న రాజ్కుమార్ ఆచూకీకి రూ.2 లక్షల రివార్డు.. 10 ప్రత్యేక బృందాలతో గాలింపు
నిజం న్యూస్, జూలై 11:
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో పోలీసు శాఖ కీలక చర్యలు చేపట్టింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో షాబాద్ సీఐ క్రాంతి రెడ్డిని సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్కుమార్పై గతంలోనే మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదైనప్పటికీ, అతడిపై సకాలంలో కఠిన చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నిర్లక్ష్యమే అనంతరం జరిగిన ఘోర ఘటనకు కారణమైందన్న ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలు ప్రారంభించారు.
ఇదిలా ఉండగా, పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రాజ్కుమార్ను పట్టుకునేందుకు సైబరాబాద్ పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అతడి ఆచూకీ తెలిపిన వారికి లేదా అరెస్టులో సహకరించిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. నిందితుడి కోసం 10 ప్రత్యేక పోలీసు బృందాలు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ గాలింపు కొనసాగిస్తున్నాయి.
ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని వెల్లడించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా దర్యాప్తును వేగవంతం చేస్తున్నామని అధికారులు తెలిపారు.
— శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



