చేవెళ్ల సబ్ ట్రెజరీలో ఏసీబీ వల.. రూ.1 లక్ష లంచం తీసుకుంటూ ముగ్గురు పట్టుబాటు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఇద్దరు ట్రెజరీ అధికారులు, ఒక ప్రైవేట్ వ్యక్తి ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ ఘటన గురువారం (సెప్టెంబర్ 17) చోటుచేసుకుంది.

హైదరాబాద్, సెప్టెంబర్ 18, 2026 | నిజం న్యూస్
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఇద్దరు ట్రెజరీ అధికారులు, ఒక ప్రైవేట్ వ్యక్తి ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ ఘటన గురువారం (సెప్టెంబర్ 17) చోటుచేసుకుంది.
చేవెళ్ల సబ్ ట్రెజరీ అధికారిగా పనిచేస్తున్న మాదిగ లక్ష్మయ్య (AO-1), అసిస్టెంట్ ట్రెజరీ అధికారిగా పనిచేస్తున్న కావలి అనురాధ (AO-2) ఫిర్యాదుదారుడి నుంచి రూ.2.50 లక్షల లంచాన్ని డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఫిర్యాదుదారుడి సస్పెన్షన్ కాలానికి సంబంధించిన రూ.23.25 లక్షల జీతం బిల్లులను ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేయడంతో పాటు, పదవీ విరమణ అనంతర పెన్షన్ సర్దుబాటు బకాయిలు రూ.4.29 లక్షలు ప్రాసెస్ చేసేందుకు ఈ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు ఏసీబీ ప్రెస్నోట్లో పేర్కొంది.
డిమాండ్ చేసిన మొత్తంలో భాగంగా తొలివిడతగా రూ.1 లక్ష చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. ఏసీబీకి ఫిర్యాదు అందడంతో అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్నారు. గురువారం ఫిర్యాదుదారుడి నుంచి రూ.1 లక్ష లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేశారు.
సబ్ ట్రెజరీ అధికారి మాదిగ లక్ష్మయ్య తన వాటాగా రూ.50 వేలు స్వీకరించగా, అసిస్టెంట్ ట్రెజరీ అధికారి కావలి అనురాధ సూచనల మేరకు వడ్డె జంగయ్య (A-3) అనే ప్రైవేట్ వ్యక్తి మరో రూ.50 వేలు స్వీకరించినట్లు ఏసీబీ తెలిపింది. దీంతో లక్ష్మయ్య, జంగయ్య వద్ద నుంచి మొత్తం రూ.1 లక్షల తైంటెడ్ నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
లంచం స్వీకరించిన ముగ్గురిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు వారిని నాంపల్లిలోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. అనంతరం న్యాయపరమైన రిమాండ్కు తరలించారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ వెల్లడించింది.
శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో,నిజం న్యూస్



