ఫీజు కట్టండి హాల్ టికెట్ తీసుకెళ్లండి..?
హుజూర్ నగర్ లో బి.ఈ.డి కళాశాల ఆగడాలు..!

కన్వీనర్ సీటు వచ్చినా తప్పని తిప్పలు*..!!
ఫీజుల పేరిట విద్యార్థుల వేధింపులు*..!!
అధికారుల మౌనం.. యాజమాన్యానికి వరమా..?
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం
స్కాలర్షిప్ రాకపోతే మా తప్పేముంది?
నేటి నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు
విద్యను వ్యాపారంగా మార్చిన కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థల ధనదాహం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది.
హుజూర్ నగర్ పట్టణం లోని బి.ఈ.డి కళాశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, అడ్డగోలు వసూళ్లకు తెరలేపింది.
పరీక్షల సమయంలో హాల్ టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను మానసిక వేదనకు గురి చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫీజుల పేరిట విద్యార్థులను వేధిస్తున్న ప్రైవేట్ కళాశాల యాజమాన్యం..!!
ప్రభుత్వం నిర్వహించిన ఎడ్ సెట్ లో ర్యాంకు సాధించి, కౌన్సెలింగ్ ద్వారా సీటు పొందిన విద్యార్థులకు సైతం తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం నుండి రావాల్సిన స్కాలర్షిప్ నిధులు ఆలస్యమవ్వడంతో, ఆ మొత్తాన్ని విద్యార్థులే చెల్లించాలని యాజమాన్యం మొండికేస్తోంది.
ఈ రోజు నుంచే పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఫీజు కడితేనే హాల్ టికెట్ ఇస్తామని విద్యార్థులను గంటల తరబడి ఎండలో నిలబెట్టడం యాజమాన్యం నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారింది.
అధికారుల మౌనం.. యాజమాన్యానికి వరమా..?
పరీక్షల సమయంలో విద్యార్థులకు హాల్ టికెట్లు నిరాకరించకూడదని స్పష్టమైన ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ, కళాశాల యాజమాన్యం వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు కనీసం అటువైపు చూడకపోవడం వెనుక ఆంతర్యమేమిటని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ర్యాంకు సాధించి సీటు తెచ్చుకున్నా మాకు ఈ కష్టాలేంటి? స్కాలర్షిప్ రాకపోతే మా తప్పేముంది? హాల్ టికెట్లు ఇవ్వకుండా మా భవిష్యత్తును నాశనం చేస్తారా?” అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఇలాంటి కళాశాలలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, విచారణ జరిపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.



