ప్రేమను నిరాకరించిందనే కక్షతో యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన ప్రేమోన్మాది!
పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ హత్యకు ఏకపక్ష ప్రేమే కారణమని తేలింది. చేతన్ చాలా కాలంగా లావణ్యను వేధిస్తున్నాడని, ఆమె తన ప్రేమను తిరస్కరించడంతో కక్ష పెంచుకుని ఈ దారుణానికి పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు.

నిజం | 17 జూలై 2026
కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్ పట్టణంలో గురువారం సాయంత్రం చోటుచేసుకున్న దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. బీసీ రోడ్లోని కేఎస్ఆర్టీసీ బస్టాండ్లో 21 ఏళ్ల లావణ్య అనే యువతిని దూరపు బంధువైన చేతన్ అత్యంత కిరాతకంగా పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేశాడు.
ఈ ఘటన అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో కూడా నమోదైనట్లు సమాచారం.
లావణ్య కళ్లడ్కలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో ఉద్యోగం చేస్తోంది. విధులు ముగించుకుని స్వగ్రామానికి వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉండగా, చేతన్ ఆమె వద్దకు వచ్చాడు. తన బ్యాగ్లో తీసుకువచ్చిన పదునైన ఆయుధంతో ఒక్కసారిగా దాడి చేయడంతో లావణ్య ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగెత్తినా, వెంటాడి నడిరోడ్డుపైనే పలుమార్లు దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ హత్యకు ఏకపక్ష ప్రేమే కారణమని తేలింది. చేతన్ చాలా కాలంగా లావణ్యను వేధిస్తున్నాడని, ఆమె తన ప్రేమను తిరస్కరించడంతో కక్ష పెంచుకుని ఈ దారుణానికి పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టగా, ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితుడు చేతన్ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు ముందు అతడు విషం సేవించినట్లు గుర్తించిన పోలీసులు చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ దారుణ ఘటనపై కర్ణాటకలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతుండగా, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
— శ్రీనివాస్ నాయక్, స్టేట్ బ్యూరో



