ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లినే హత్య చేసిన కూతురు..
రూ.7 లక్షల సుపారీతో రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే కుట్ర బట్టబయలు!

జూలై 8, 2026 | నిజం న్యూస్
రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్లో మానవత్వాన్ని కలచివేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబ ఆస్తిపై ఆశతో 23 ఏళ్ల యువతి తన సొంత తల్లిని హత్య చేయించేందుకు రూ.7 లక్షల సుపారీ ఇచ్చిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ, లోతైన దర్యాప్తులో అసలు కుట్ర బయటపడింది.
పోలీసుల వివరాల ప్రకారం, మృతురాలు నీరజ్ శర్మ (45) జైపూర్ కోర్టులో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)గా పనిచేస్తున్నారు. ఈ నెల జూలై 3న తన కుమారుడిని కోచింగ్ సెంటర్లో దించి ఇంటికి తిరిగి వస్తుండగా, వేగంగా వచ్చిన స్కార్పియో వాహనం ఆమెను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టింది. మొదట ఇది సాధారణ రోడ్డు ప్రమాదమని భావించినప్పటికీ, మృతురాలి సోదరుడు అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. మృతురాలి కుమార్తె ఆయుషి శర్మ (23) తన తండ్రి మరణం తర్వాత తల్లికి వచ్చిన కారుణ్య నియామక ప్రభుత్వ ఉద్యోగాన్ని తాను పొందాలనే ఆశతో పాటు కుటుంబ ఆస్తిని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ హత్యకు పథకం రచించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందుకోసం బంధువులు, మరికొందరి సహకారంతో సుమారు మూడు నెలల పాటు కుట్ర పన్ని, రూ.7 లక్షలకు కిరాయి హంతకులను నియమించినట్లు విచారణలో తేలింది.
పోలీసుల సమాచారం ప్రకారం, నిందితులు తొలుత థార్ వాహనంతో హత్యాయత్నం చేయాలని ప్రయత్నించినా అది విఫలమైంది. అనంతరం బాధితురాలి రోజువారీ కదలికలను గమనిస్తూ, సరైన సమయం చూసి స్కార్పియో వాహనంతో ఢీకొట్టి హత్య చేశారు. అనంతరం ఘటనను ప్రమాదంలా చూపించేందుకు వాహనాన్ని అక్కడే వదిలి, మోటార్సైకిల్పై పరారయ్యారు.
ఈ కేసులో కుమార్తెతో పాటు మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ప్రధాన నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. నిందితులపై హత్య, కుట్ర తదితర తీవ్ర అభియోగాల కింద కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.
— శ్రీనివాస్ నాయక్, స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



