చేర్యాల తహసీల్దార్ ఏసీబీ వలలో.. రూ.70 వేల లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబాటు
సిద్దిపేట జిల్లా చేర్యాల మండల తహసీల్దార్ కొర్ర దిలీప్ నాయక్ను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు

హైదరాబాద్, జూలై 6, 2026 (నిజం న్యూస్):
సిద్దిపేట జిల్లా చేర్యాల మండల తహసీల్దార్ కొర్ర దిలీప్ నాయక్ను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అధికారిక విధి నిర్వహణలో భాగంగా 11 నాలా (NALA) కన్వర్షన్ దరఖాస్తుల ప్రాసెసింగ్ కోసం ఫిర్యాదుదారుని నుంచి రూ.70 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్న సమయంలో ఆయనను తన కార్యాలయంలోనే అదుపులోకి తీసుకున్నారు.
ఏసీబీ విడుదల చేసిన వివరాల ప్రకారం, నాగాపురి గ్రామానికి చెందిన సర్వే నంబర్లు 833/B, 833/C, 833/D, 833/E, 834/B, 834/C, 834/D, 834/Eలకు సంబంధించిన సుమారు 30 గుంటల భూమి నాలా కన్వర్షన్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఈ లంచం కోరినట్లు వెల్లడించింది. మొత్తం 11 దరఖాస్తుల్లో ఇప్పటికే 8 దరఖాస్తులను ప్రాసెస్ చేసినట్లు పేర్కొంది.
తహసీల్దార్ వద్ద నుంచి రూ.70 వేల లంచం మొత్తాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజా విధులను నిజాయితీకి విరుద్ధంగా నిర్వహించి అక్రమ లాభం పొందేందుకు ప్రయత్నించినట్లు అధికారులు పేర్కొన్నారు.
నిందితుడిని అరెస్టు చేసి హైదరాబాద్లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు వెల్లడించారు.
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినట్లయితే ప్రజలు టోల్ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలని ఏసీబీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేసింది.
— శ్రీనివాస్ నాయక్, స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



