రైలు కిందపడి దంపతుల బలవన్మరణం.. ఆర్థిక ఇబ్బందులతో విషాదాంతం
అప్పుల భారం పెరగడంతో పాటు వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.

నిజం న్యూస్ | వరంగల్ | జూలై 3
ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఓ దంపతులు రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన గురువారం రాత్రి మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన రవికుమార్ (32), శిరీష (28) దంపతులు గత కొంతకాలంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అప్పుల భారం పెరగడంతో పాటు వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఘట్కేసర్ సమీపంలోని రైల్వే ట్రాక్పైకి వెళ్లిన దంపతులు వేగంగా వస్తున్న రైలు కిందపడి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పరిశీలించారు.
మృతుల వద్ద లభించిన ఆధారాల ఆధారంగా వారు వరంగల్ జిల్లాకు చెందిన దంపతులుగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రాథమిక విచారణలో ఆర్థిక ఇబ్బందులే ఈ విషాదానికి ప్రధాన కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
– శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



