ఫాదర్స్ డే రోజున విషాదం.. ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసిన ఘటన
ఖమ్మంలో దారుణం.. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి ఆత్మహత్యాయత్నం

ఖమ్మంలో దారుణం.. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి ఆత్మహత్యాయత్నం
21 జూన్ 2026, ఆదివారం | నిజం న్యూస్ | ఖమ్మం
ఫాదర్స్ డే రోజున ఖమ్మం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు తీవ్రరూపం దాల్చడంతో ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులకు ఎలుకల మందు తినిపించి, అనంతరం తాను కూడా తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఖమ్మం త్రీ టౌన్ పరిధిలోని గాంధీనగర్లో లింగరాజు–స్వాతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమారులు వేదిక్ కుమార్ (7), తనిష్క్ (5)లు ఉన్నారు. సమాచారం ప్రకారం, కుటుంబంలో నెలకొన్న కలహాల నేపథ్యంలో స్వాతి ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
విషం ప్రభావంతో తీవ్ర అస్వస్థతకు గురైన ముగ్గురినీ వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. తల్లి స్వాతి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం.
పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలే కారణమా లేదా మరే ఇతర కోణాలు ఉన్నాయా అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.
ఈ ఘటనతో గాంధీనగర్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
_శ్రీనివాస్ నాయక్ స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



