పిచ్చికుక్క దాడిలో మేకల కాపరికి తీవ్ర గాయాలు
రాజుర గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. మేకల మంద వద్ద నిద్రిస్తున్న కాపరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజుర గ్రామానికి చెందిన భూమన్న మేకల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి మేకల మంద వద్ద కాపలాగా బయట నిద్రిస్తుండగా, ఒక్కసారిగా వచ్చిన పిచ్చికుక్క భూమన్నపై పడి విచక్షణారహితంగా కరిచింది.
బాధితుడి అరుపులు విన్న స్థానికులు వెంటనే 108 అత్యవసర వాహనానికి సమాచారం అందించారు. వాహన సిబ్బంది ప్రమోద్, గోపిలు తక్షణమే స్పందించి బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మెరుగైన వైద్యం నిమిత్తం నిర్మల్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్రామాల్లో కుక్కల సంచారం పెరిగిపోవడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.



