డ్రైవింగ్ లైసెన్స్కు కొత్త రూల్స్… మూడు దశల పరీక్ష తప్పనిసరి..!
కొత్త విధానం ప్రకారం, లెర్నర్ లైసెన్స్ (LLR) కోసం దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా ప్రభుత్వం నిర్వహించే ఆన్లైన్ రోడ్డు భద్రతా అవగాహన కోర్సు పూర్తి చేయాలి.

హైదరాబాద్: ఏప్రిల్ 05
రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ జారీ విధానంలో కీలకమైన మార్పులు చేసింది.
ఇప్పటి వరకు అమలులో ఉన్న రెండు దశల విధానాన్ని రద్దు చేసి, ఇకపై మూడు దశల విధానం ద్వారా మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ పొందేలా కొత్త గైడ్లైన్స్ రూపొందించింది.
బాధ్యతాయుతమైన డ్రైవర్లను తయారు చేయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు.
ఈ కొత్త విధానం ప్రకారం, లెర్నర్ లైసెన్స్ (LLR) కోసం దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా ప్రభుత్వం నిర్వహించే ఆన్లైన్ రోడ్డు భద్రతా అవగాహన కోర్సు పూర్తి చేయాలి.
ఈ కోర్సు మొత్తం మూడు గంటల పాటు కొనసాగుతుంది మరియు ఆరు మాడ్యూల్స్గా విభజించబడుతుంది.
ఇందులో ట్రాఫిక్ నిబంధనలు, సురక్షిత డ్రైవింగ్ పద్ధతులు, ప్రమాదాల ప్రధాన కారణాలు వంటి అంశాలను స్పష్టంగా వివరించనున్నారు.
ప్రత్యేకంగా వీడియోల ద్వారా అవగాహన కల్పించడం ఈ కోర్సులో ముఖ్య లక్షణంగా ఉంటుంది. నిజ జీవితంలో జరిగిన రోడ్డు ప్రమాదాల దృశ్యాలను చూపిస్తూ డ్రైవర్లు చేసే పొరపాట్లను అర్థమయ్యేలా వివరిస్తారు.
అలాగే అద్దాల వినియోగం, ఓవర్టేకింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రాత్రి డ్రైవింగ్ విధానం వంటి అంశాలపై కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.
ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులకు ఒక యూనిక్ సర్టిఫికేట్ నంబర్ ఇవ్వబడుతుంది. ఈ నంబర్ ఉన్నవారికే లెర్నర్ లైసెన్స్ కోసం అప్లై చేసే అవకాశం ఉంటుంది.
అంటే ఈ ఆన్లైన్ కోర్సు పూర్తి చేయకుండా లైసెన్స్ ప్రక్రియలో ముందుకు వెళ్లడం అసాధ్యం.
అభ్యర్థులు ఈ పరీక్షను తమ ఇంటి నుంచే కంప్యూటర్ ద్వారా రాయవచ్చు. అలాగే గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూళ్లలో కూడా ఈ పరీక్షను నిర్వహించనున్నారు.
ఈ విధానం ద్వారా దళారీల ప్రభావం తగ్గి, వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 1.7 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.
ప్రపంచంలో అత్యధిక ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. అనుభవం లేని డ్రైవర్లు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేకపోవడం వంటి కారణాలు ఈ ప్రమాదాలకు దారితీస్తున్నాయి.
మూడంచెల విధానం అమలులోకి రావడంతో ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పొందడం కొంత కఠినంగా మారినా, ప్రజల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
రోడ్డుపైకి రావడానికి ముందు సరైన అవగాహన కలిగి ఉండటం ఎంత ముఖ్యమో ఈ కొత్త విధానం తెలియజేస్తోంది.



