దేవస్థాన అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత..గోదావరి నది తీరంలో ఆధునిక సదుపాయాలతో ఘాట్లను నిర్మిస్తాం
మైథిలి స్టేడియంలో నిర్వహించిన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొననున్న ముఖ్యమంత్రి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు.

భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లుబట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవస్థాన అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
అనంతరం మైథిలి స్టేడియంలో నిర్వహించిన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొననున్న ముఖ్యమంత్రి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా సుమారు రూ.351 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న భద్రాద్రి దేవస్థానం సమగ్ర పునర్ అభివృద్ధి పనులకు, అలాగే గోదావరి నది తీరంలో ఆధునిక సదుపాయాలతో ఘాట్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమి పూజ నిర్వహించారు.
ఈ పనుల ద్వారా యాత్రికులకు మెరుగైన వసతులు, భద్రతా ఏర్పాట్లు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
దేవస్థాన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యే సరికి భద్రాద్రి క్షేత్రం మరింత వైభవంగా తీర్చిదిద్దబడుతుందని, దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు .



