వనపర్తి డాగ్ స్క్వాడ్కు కొత్త ట్రాకర్ శునకం “మాయ”
వనపర్తి జిల్లా పోలీసు విభాగానికి భద్రతా పరంగా మరింత బలాన్ని చేకూర్చే దిశగా, దొంగతనాలు, హత్య కేసుల విచారణలో కీలక ఆధారాలను వెలికితీయగల ట్రాకర్ శునకం “మాయ” నూతనంగా వనపర్తి పోలీసులో చేరినట్లు జిల్లా ఎస్పీ సునిత రెడ్డి ఐపీఎస్ తెలిపారు.

జిల్లా ఎస్పీ సునిత రెడ్డి
నేరస్థుల అడుగుజాడల ఆధారాలు గుర్తింపులో ట్రాకర్ “మాయ ” ప్రత్యేక ప్రావీణ్యం
8 నెలల కఠోర శిక్షణ పూర్తి ఫీల్డ్ విధులకు “మాయ” సిద్ధం
నేరదర్యాప్తులో కీలక దిశానిర్దేశం అందించనున్న శునక దళం
ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో ఫిబ్రవరి 19 (నిజం చెపుతాం)
వనపర్తి జిల్లా పోలీసు విభాగానికి భద్రతా పరంగా మరింత బలాన్ని చేకూర్చే దిశగా, దొంగతనాలు, హత్య కేసుల విచారణలో కీలక ఆధారాలను వెలికితీయగల ట్రాకర్ శునకం “మాయ” నూతనంగా వనపర్తి పోలీసులో చేరినట్లు జిల్లా ఎస్పీ సునిత రెడ్డి ఐపీఎస్ తెలిపారు.
8 నెలలపాటు ప్రత్యేక మరియు కఠిన శిక్షణను పూర్తి చేసుకున్న డాగ్ హాండ్లర్ కానిస్టేబుల్ దేవ్యానాయక్, గురువారం రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీమతి సునీత రెడ్డి, ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్ సమీపంలోని పోలీస్ డాగ్ ట్రైనింగ్ సెంటర్, ఐఐటీఏ మోహినాబాద్లో నిర్వహించిన శిక్షణలో ట్రాకర్ శునకం “మాయ” ప్రదర్శించిన సామర్థ్యాలు, ఫీల్డ్లో దాని పనితీరు తదితర అంశాలను ఎస్పీ కి శిక్షణ కాలంలో “మాయ” అనుమానాస్పద వస్తువుల గుర్తింపు, నేరస్థుల అడుగుజాడల పసిగట్టడం, క్లిష్ట పరిస్థితుల్లో సమర్థవంతమైన విధి నిర్వహణలో విశేష ప్రావీణ్యం సాధించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… జిల్లాలో జరిగే దొంగతనాలు, హత్య కేసుల దర్యాప్తులో ట్రాకర్ శునకం “మాయ ” కీలక పాత్ర పోషిస్తుందని నేరస్థలంలో నేరస్థుల అడుగుజాడలను పసిగట్టి, దర్యాప్తుకు స్పష్టమైన దిశానిర్దేశం అందించడంలో ట్రాకర్ సమర్థవంతంగా పనిచేస్తుందని నేరాన్ని కేవలం విచారణతోనే కాదు, ఆధారాలతోనే చేదించాలి.
ఆ ఆధారాలను పసిగట్టే నిశ్శబ్ద యోధులే ఈ ట్రాకర్ శునకం ” అని ఎస్పీ గారు స్పష్టం చేశారు. జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ నిఘా వ్యవస్థలతో పాటు శునక దళం సేవలను సమన్వయంతో వినియోగించనున్నట్లు తెలిపారు.
ప్రజల ప్రాణాలు మరియు ఆస్తుల రక్షణే పోలీసుశాఖ యొక్క ప్రధాన బాధ్యతని ప్రజలు కూడా పోలీసులకు సహకరించి, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలను వెంటనే సమీప పోలీసు అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
నూతనంగా చేరిన ట్రాకర్ శునకం “మాయ”తో వనపర్తి జిల్లా పోలీసు విభాగం మరింత అప్రమత్తంగా, సమర్థవంతంగా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు,ఎస్పీ, వీరారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్, అప్పలనాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.



