₹75 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ, కానిస్టేబుల్
చందానగర్ పోలీస్ స్టేషన్, సైబరాబాద్ కమిషనరేట్కు చెందిన సబ్ఇన్స్పెక్టర్ బండెల బాలరాజ్, కానిస్టేబుల్ బి. రాఘవేంద్ర (PC-7491) ఓ క్రిమినల్ కేసు దర్యాప్తు చేసి ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.75,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి

హైదరాబాద్, ఆగస్టు 23, నిజం న్యూస్:
చందానగర్ పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ, కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ ఘటన శనివారం (ఆగస్టు 22) చోటుచేసుకుంది.
ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్ పోలీస్ స్టేషన్, సైబరాబాద్ కమిషనరేట్కు చెందిన సబ్ఇన్స్పెక్టర్ బండెల బాలరాజ్, కానిస్టేబుల్ బి. రాఘవేంద్ర (PC-7491) ఓ క్రిమినల్ కేసు దర్యాప్తు చేసి ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.75,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ మేరకు శనివారం లంచం మొత్తాన్ని స్వీకరిస్తుండగా రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు దాడి చేసి ఇద్దరినీ పట్టుకున్నారు. ఎస్ఐ కార్యాలయంలోని టేబుల్ డ్రాయర్ నుంచి రూ.75,000 నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అంతకుముందే ఎస్ఐ రూ.20,000 నగదు, కానిస్టేబుల్ రూ.10,000 యూపీఐ ద్వారా తీసుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది. దీంతో మొత్తం లంచం డిమాండ్ రూ.1.05 లక్షలకు చేరినట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వర్తించాల్సిన అధికారులు అక్రమ ప్రయోజనం పొందేందుకు విధులను సక్రమంగా నిర్వర్తించలేదని ఏసీబీ పేర్కొంది. ఇద్దరినీ అరెస్టు చేసి హైదరాబాద్లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించేందుకు చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
లంచం డిమాండ్ చేసిన ఏ ప్రభుత్వ ఉద్యోగి గురించిన సమాచారమైనా ప్రజలు తెలంగాణ ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు.
శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



