ప్రభుత్వ ఆసుపత్రిలో రెండేళ్లుగా పని చేయని లిఫ్ట్.. రోగులకు నరకయాతన
రెండు సంవత్సరాలుగా లిఫ్ట్ పనిచేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, వృద్ధులు, అత్యవసర చికిత్స అవసరమైన రోగులు పై అంతస్తులకు వెళ్లేందుకు నిత్యం అవస్థలు పడుతున్నారు.

మహబూబాబాద్, జూలై 3 (నిజం న్యూస్): మహబూబాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో గత రెండు సంవత్సరాలుగా లిఫ్ట్ పనిచేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, వృద్ధులు, అత్యవసర చికిత్స అవసరమైన రోగులు పై అంతస్తులకు వెళ్లేందుకు నిత్యం అవస్థలు పడుతున్నారు.
ఈ విషయంపై లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ మాట్లాడుతూ, స్ట్రెచర్పై రోగులను పై అంతస్తులకు తరలించాల్సి రావడంతో వైద్య సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే ఆసుపత్రి పై అంతస్తుల్లో తాగునీటి సౌకర్యం లేక రోగులు, వారి సహాయకులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
లిఫ్ట్ మరమ్మతులు, తాగునీటి సమస్యతో పాటు ఆసుపత్రిలోని ఇతర సమస్యలను పలుమార్లు ఆసుపత్రి సూపరింటెండెంట్, ఏడి దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. అధికారులు సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో లిఫ్ట్ను వెంటనే మరమ్మతులు చేయడంతో పాటు పై అంతస్తుల్లో తాగునీటి సౌకర్యం కల్పించి, ఆసుపత్రిలోని ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని బోడ రమేష్ నాయక్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వందలాది మంది ప్రజలతో కలిసి ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
– శ్రీనివాస్ నాయక్, స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



