ఏసీబీ దాడుల్లో డీఎస్పీ అక్రమాస్తుల గుట్టురట్టు..! కోట్ల విలువైన భూములు, విల్లాలు, నగదు, బంగారం స్వాధీనం
తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS), హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) సంకిరెడ్డి భీమ్ రెడ్డిపై అక్రమాస్తుల కేసు నమోదు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వెల్లడించింది.

నిజం న్యూస్, 02-07-2026:
తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS), హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) సంకిరెడ్డి భీమ్ రెడ్డిపై అక్రమాస్తుల కేసు నమోదు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వెల్లడించింది.
తెలిసిన ఆదాయ వనరులకు మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో, అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి గురువారం (02-07-2026) ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
సోదాల్లో హైదరాబాద్, గచ్చిబౌలి, టెలికాం నగర్, మణికొండ, తెల్లాపూర్, నాగోల్, పటాన్చెరు, వికార్ాబాద్, సంగారెడ్డి, కర్ణాటకలోని దేవనహళ్లి తదితర ప్రాంతాల్లో విల్లాలు, ఇండ్లు, ఫ్లాట్లు, కమర్షియల్ స్పేస్లు, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తించారు. అలాగే రూ.75 లక్షల పెట్టుబడి, భారీ స్థిరాస్తుల పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.
అదనంగా సోదాల్లో సుమారు రూ.43.60 లక్షల నగదు, సుమారు 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు, సుమారు రూ.19.91 లక్షల బ్యాంకు నిల్వలు గుర్తించినట్లు ఏసీబీ తెలిపింది.
స్వాధీనం చేసుకున్న స్థిరాస్తుల మార్కెట్ విలువ పత్రాల్లో నమోదైన విలువ కంటే పలుమార్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
— శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



