రోడ్డుపై చెల్లాచెదురైన ధాన్యం …రైతుకు అండగా నిలిచిన అతడు..
విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు సిబ్బంది కానిస్టేబుల్ భాస్కర్, పాపాలాల్తో పాటు హోమ్ గార్డ్ వెంకన్న వెంటనే స్పందించి పరిస్థితిని గమనించారు. రోడ్డు రాకపోకలకు అంతరాయం కలగకుండా ముందుగా వాహనాలను నియంత్రించి, అనంతరం రోడ్డుపై పడిన ధాన్యాన్ని వృథా కాకుండా జాగ్రత్తగా సేకరించారు.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అండర్ బ్రిడ్జి వద్ద మానవతా విలువలను ప్రతిబింబించే ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై ఓ రైతు రవాణా చేస్తున్న ధాన్యం బస్తా ప్రమాదవశాత్తూ జారి పడిపోవడంతో ధాన్యం అంతా రోడ్డుపై చెల్లాచెదురైంది.
ఈ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు సిబ్బంది కానిస్టేబుల్ భాస్కర్, పాపాలాల్తో పాటు హోమ్ గార్డ్ వెంకన్న వెంటనే స్పందించి పరిస్థితిని గమనించారు. రోడ్డు రాకపోకలకు అంతరాయం కలగకుండా ముందుగా వాహనాలను నియంత్రించి, అనంతరం రోడ్డుపై పడిన ధాన్యాన్ని వృథా కాకుండా జాగ్రత్తగా సేకరించారు.
సేకరించిన ధాన్యాన్ని తిరిగి బస్తాల్లో నింపి రైతుకు అందజేయడంతో పాటు ట్రాఫిక్ సజావుగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. వారి తక్షణ స్పందనతో కొద్దిసేపు ఏర్పడిన అంతరాయం కూడా తొలగిపోయింది.
ఈ సందర్భంగా రైతు భూక్యా బాలాజీ ట్రాఫిక్ పోలీసు సిబ్బంది సేవలను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు చూపిన మానవతా స్ఫూర్తి పట్ల స్థానికులు కూడా ప్రశంసలు వ్యక్తం చేశారు.
ప్రజలు కూడా రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ, సరుకు రవాణా సమయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.



