వేములవాడ భీమన్న ఆలయంలో భక్తుల రద్దీ
కిక్కిరిసిన క్యూలైన్లు రాజన్న అనుబంధ ఆలయంలో శివనామస్మరణ: దర్శనానికి బారులు తీరిన భక్తజనం

వేములవాడ ఏప్రిల్ 6 ( నిజంచెపుతాం )
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం భక్తజన సంద్రంగా మారింది.
వారం ప్రారంభం, అందులోనూ శివునికి ప్రీతిపాత్రమైన సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మారుమోగింది.
భక్తులు భీమేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, అర్చకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.



