యాదగిరిగుట్ట పవిత్రత ప్రశ్నార్థకం..? అర్చకులపై విమర్శల వర్షం
ప్రధాన అర్చకుడు కాండూరి వెంకటాచార్యులు, ముఖ్య అర్చకుడు కాండూరి శ్రీనివాసచార్యులు ఆలయ శాస్త్రాలు, సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తించారని ఆరోపించారు

పవిత్రత ప్రశ్నార్థకం..? అర్చకులపై విమర్శల వర్షం
యాదగిరిగుట్ట,మార్చి 22(నిజంచెపుతాం)
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శాస్త్ర విరుద్ధంగా వ్యవహరించిన ప్రధాన అర్చకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ డిమాండ్ చేశారు.
ఆదివారం ఆయన పలు హిందూ సంఘాల నాయకులతో కలిసి దేవస్థానం ఈవో జె. భవానీ శంకర్కు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ప్రధాన అర్చకుడు కాండూరి వెంకటాచార్యులు, ముఖ్య అర్చకుడు కాండూరి శ్రీనివాసచార్యులు ఆలయ శాస్త్రాలు, సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తించారని ఆరోపించారు.
కాండూరి వెంకటాచార్యుల సన్నిహిత బంధువుకు శిశువు జన్మించడంతో హిందూ శాస్త్రాల ప్రకారం “జాత శౌచం” పది రోజులపాటు పాటించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో ఆలయ సేవలు, పూజలు చేయకూడదని స్పష్టం చేశారు.అయితే, జాత శౌచం ఉన్నప్పటికీ బ్రహ్మోత్సవాలు,కల్యాణ మహోత్సవం,రథోత్సవం, పూర్ణాహుతి,చక్రస్నానం వంటి కీలక కార్యక్రమాల్లో అర్చకులు పాల్గొనడం ద్వారా ఆలయ సంప్రదాయాలకు భంగం కలిగించారని ఆరోపించారు.
ప్రభుత్వానికి సమర్పించే పట్టు వస్త్రాలను కూడా మైలలోనే స్వీకరించడం, మంత్రులు, అధికారులకు ఆశీర్వచనాలు ఇవ్వడం వంటి చర్యలను తీవ్రంగా విమర్శించారు.ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించినప్పటికీ, టీవీలు, పత్రికల ద్వారా వెలుగులోకి వచ్చిందన్నారు.
ఇది హిందూ ధర్మం, శాస్త్రాలకు అవమానకరమని పేర్కొన్నారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఐఏఎస్ అధికారి లేదా రిటైర్డ్ న్యాయమూర్తితో కమిటీ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు.



