విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం… రైతు ప్రాణం బలి..ఏఈ, లైన్మెన్లపై కేసు నమోదు చేయాలని రైతుల డిమాండ్.. రోడ్ పై రాస్తారోకో
రైతులు మాట్లాడుతూ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే యాదయ్య ప్రాణం తీసిందని ఆరోపించారు. రైతు పొలం వద్ద కొత్త విద్యుత్ లైన్ మంజూరు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని తెలిపారు.

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం… రైతు ప్రాణం బలి
– బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తుల రాస్తారోకో
– 15 సార్లు డీడీలు చెల్లించినా స్పందించలేదని ఆవేదన
నాగారం, మార్చి 27.నిజం చెపుటాం
నాగారం మండల పరిధిలోని నాగారం బంగ్లా గ్రామపంచాయతీకి చెందిన రైతు కన్నెబోయిన యాదయ్య (56) విద్యుత్ షాక్తో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
గురువారం జరిగిన ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు శుక్రవారం ఉదయం జనగామ–సూర్యాపేట ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే యాదయ్య ప్రాణం తీసిందని ఆరోపించారు. రైతు పొలం వద్ద కొత్త విద్యుత్ లైన్ మంజూరు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని తెలిపారు.
ఈ విషయంలో ఇప్పటివరకు సుమారు 15 సార్లు డీడీలు చెల్లించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.నూతన విద్యుత్ లైన్ మంజూరు చేసి ఉంటే యాదయ్య ప్రాణాలతో ఉండేవారని గ్రామస్తులు పేర్కొన్నారు.
విద్యుత్ శాఖలో లంచాలు ఇస్తేనే పనులు జరుగుతున్నాయని, లేకపోతే ఫిర్యాదులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
అంతేకాకుండా, సంబంధిత ఏఈ ఒక ప్రైవేట్ వ్యక్తిని హెల్పర్గా నియమించి వసూళ్లకు పాల్పడుతున్నాడని కూడా విమర్శించారు.
గతంలో పలు మార్లు ప్రమాదకరమైన విద్యుత్ లైన్ మార్చాలని ఫిర్యాదు చేసినప్పటికీ ఏఈ, లైన్మెన్ స్పందించలేదని రైతులు తెలిపారు.
అదే లైన్ కారణంగా ఈ దుర్ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ప్రాణాలు పోతే తప్ప అధికారులు స్పందించరా అంటూ మండిపడ్డారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించి రైతు మరణానికి కారణమైన విద్యుత్ ఏఈ, లైన్మెన్పై వెంటనే కేసు నమోదు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
రాస్తారోకో విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై చిరంజీవి ఘటనాస్థలికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఆయన హామీతో గ్రామస్తులు ధర్నాను విరమించారు.



