ఇంటర్మీడియెట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి…కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా మొత్తం 37 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్తో పాటు సంబంధిత విభాగాధిపతులను నియమించినట్లు తెలిపారు. పరీక్షలు సజావుగా, నిష్పక్షపాతంగా జరిగేలా అనుభవం కలిగిన ఇన్విజిలేటర్లను నియమించాలని ఆదేశించారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫిబ్రవరి 17: (నిజం చెప్పుతాం న్యూస్) కొత్తగూడెం: జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 25వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియెట్ పరీక్షలను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 37 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్తో పాటు సంబంధిత విభాగాధిపతులను నియమించినట్లు తెలిపారు. పరీక్షలు సజావుగా, నిష్పక్షపాతంగా జరిగేలా అనుభవం కలిగిన ఇన్విజిలేటర్లను నియమించాలని ఆదేశించారు.
పరీక్షల పర్యవేక్షణ కోసం ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాల భద్రత విషయంలో పూర్తి అప్రమత్తత పాటించాలని సూచించారు. ప్రశ్నాపత్రాల నిల్వ, పంపిణీ, రవాణా ప్రక్రియలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, సంబంధిత పోలీస్ స్టేషన్లలో స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేసి భద్రత మధ్య రవాణా నిర్వహించాలని పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బి అమలు చేసి, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల ప్రాంతంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు.
పరీక్షలు ముగిసిన అనంతరం జవాబు పత్రాలను అత్యంత జాగ్రత్తగా, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా సంబంధిత మూల్యాంకన కేంద్రాలకు పంపించేందుకు పోస్టల్ శాఖ అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
జవాబు పత్రాల సీలింగ్, భద్రతా తనిఖీలు, రవాణా ప్రక్రియలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని, నిర్ణీత కాలవ్యవధిలో గమ్యస్థానాలకు చేరేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష నిర్వహించు రోజుల్లో ఉదయం 6.00 గంటల నుంచి 8.00 గంటల వరకు ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచనలు ఇచ్చారు.
పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా విద్యుత్ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్య శాఖ అధికారులు ప్రతి పరీక్షా కేంద్రంలో అవసరమైన మందులు, ప్రథమ చికిత్స సదుపాయాలు కల్పించి, ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచాలని సూచించారు.
మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్, పంచాయతీ శాఖ అధికారులు పరీక్షా కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులను సమకూర్చాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష రాయనున్న విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం ఒక గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
ఇంటర్మీడియెట్ పరీక్షలను ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జెడ్పి సీఈవో నాగలక్ష్మి, జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి వెంకటేశ్వరరావు, టేకులపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సులోచన రాణి, వైద్యశాఖ, పోలీస్ శాఖ, మున్సిపల్, పంచాయతీ, విద్యుత్, పోస్టల్ శాఖ తదితర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.



