నాసిరకం మందులపై డిజిటల్ కట్టడి — ప్రజారోగ్య రక్షణలో తెలంగాణకు కొత్త దిశ
నాణ్యత లేని (ఎన్ఎస్క్యూ) మందులను వెంటనే గుర్తించి వాటిపై రాష్ట్రవ్యాప్తంగా బల్క్ ఎస్ఎమ్ఎస్ అలర్ట్ సిస్టమ్ ప్రారంభించడం ద్వారా ఔషధ భద్రతను బలోపేతం చేసే ప్రయత్నం ప్రారంభమైంది

ప్రజల ఆరోగ్యం రక్షించడం ఏ ప్రభుత్వానికైనా అత్యంత ప్రాధాన్యమైన బాధ్యత. ముఖ్యంగా ఔషధాల నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం కూడా తీవ్ర పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రజారోగ్య రక్షణలో ఒక కీలక ముందడుగుగా భావించాలి.
నాణ్యత లేని (ఎన్ఎస్క్యూ) మందులను వెంటనే గుర్తించి వాటిపై రాష్ట్రవ్యాప్తంగా బల్క్ ఎస్ఎమ్ఎస్ అలర్ట్ సిస్టమ్ ప్రారంభించడం ద్వారా ఔషధ భద్రతను బలోపేతం చేసే ప్రయత్నం ప్రారంభమైంది.
ఇప్పటివరకు నాసిరకం మందులపై హెచ్చరికలు ప్రధానంగా కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ వెబ్సైట్ లేదా నెలవారీ సర్క్యులర్ల ద్వారా మాత్రమే అందేవి.
ఈ ప్రక్రియలో సాధారణంగా పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఆలస్యం జరిగేది. ఈలోపు అనేక మెడికల్ షాపుల్లో ఆ మందులు విక్రయమయ్యే అవకాశం ఉండేది. దీని వల్ల ప్రజల ఆరోగ్యంపై అనుకోని ప్రమాదాలు తలెత్తే పరిస్థితి ఏర్పడేది.
ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు తక్షణ సమాచార వ్యవస్థను ప్రవేశపెట్టింది.
కొత్త బల్క్ ఎస్ఎమ్ఎస్ అలర్ట్ వ్యవస్థ ద్వారా నాసిరకం మందు గుర్తించగానే మెడికల్ షాపులు, తయారీ సంస్థలు, పంపిణీదారులకు వెంటనే హెచ్చరికలు చేరనున్నాయి.
ఎస్ఎమ్ఎస్, ఈమెయిల్ లేదా మొబైల్ అనువర్తనాల ద్వారా సమాచారం అందించబడుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు నలభై ఎనిమిది వేల మెడికల్ షాపులు, ఏడువందల అరవై తయారీ సంస్థలు మరియు టోకు వ్యాపారులకు ఒకేసారి సమాచారం చేరేలా ఈ వ్యవస్థ రూపొందించబడింది.
అలర్ట్ అందిన వెంటనే ఆ మందు విక్రయాలను నిలిపివేయాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది.
ఈ విధానం అమలులోకి రావడం ద్వారా నాసిరకం మందులు మార్కెట్లో కొనసాగకుండా ముందుగానే అడ్డుకునే అవకాశం ఉంటుంది.
ఔషధాల నాణ్యతపై నిఘా మరింత కఠినతరం అవుతుంది. ప్రజల చేతుల్లోకి అనర్హ మందులు చేరకుండా నిరోధించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
ఆరోగ్య నిపుణులు కూడా ఈ వ్యవస్థను స్వాగతిస్తున్నారు. తక్షణ సమాచారంతో ఔషధ భద్రతా వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని వారు భావిస్తున్నారు.
ఇక ఔషధ పరీక్షల సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒకే ప్రయోగశాల ద్వారా సంవత్సరానికి ఐదు నుంచి ఆరు వేల వరకు నమూనాలు పరీక్షిస్తున్నారు.
భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచే లక్ష్యంతో వరంగల్, నిజామాబాద్, మహబూబ్నగర్, నల్గొండ ప్రాంతాల్లో కొత్త ప్రయోగశాలలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
అదనంగా మరిన్ని తనిఖీ అధికారులను నియమించాలనే ఆలోచన కూడా ఉంది.
ఔషధ భద్రతలో సాంకేతికతను వినియోగించడం కాలానుగుణ అవసరం. తెలంగాణలో ప్రారంభమైన ఈ డిజిటల్ హెచ్చరిక వ్యవస్థ ప్రజారోగ్య పరిరక్షణలో ఒక ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది.
నాణ్యత లేని మందులపై కట్టడి పెరిగితేనే ప్రజలకు సురక్షిత వైద్య సేవలు అందుతాయి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా ఈ విధానం మరింత సమర్థంగా అమలవడం అవసరం..
(సి.హెచ్.ప్రతాప్)
మొబైల్ నెంబర్: 98808 51898



