POCSO: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 𝟓 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష…బాలికకు రూ. 1,00,000/- పరిహారం

POCSO: ఎనిమిదేళ్ల మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడికి కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
హకా భవన్లోని పోక్సో (POCSO) చట్టం కేసుల ప్రత్యేక సెషన్స్ జడ్జి జి. ఉదయ్ భాస్కర్ రావు ఈ మేరకు తీర్పు వెల్లడించారు.
కేసు వివరాలు:
చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని జి.ఎం. కాలనీకి చెందిన అబ్దుల్ ఖయ్యూమ్ (23) అనే వ్యక్తి మైనర్ బాలికకు అరబిక్ ట్యూషన్ చెప్పేవాడు.
2019లో ఒకరోజు ట్యూషన్ సమయంలో బాలికతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, సెల్ ఫోన్ ఆశ చూపి బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాలిక గట్టిగా అరవడంతో నిందితుడు అక్కడి నుండి తప్పించుకున్నాడు.
బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు ఐపిసి సెక్షన్ 354-A మరియు పోక్సో చట్టంలోని సెక్షన్ 10 r/w 9(m) కింద కేసు నమోదు చేశారు.
కోర్టు తీర్పు:
శాస్త్రీయ ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి, నిందితుడు అబ్దుల్ ఖయ్యూమ్ను దోషిగా నిర్ధారించారు. నిందితుడికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 5000 రూపాయల జరిమానాతో పాటు బాధిత బాలికకు రూ. 1,00,000/- పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
భరోసా కేంద్రం తోడ్పాటు:
ఈ క్లిష్ట సమయంలో ‘భరోసా’ కేంద్రం బృందం బాధిత బాలికకు, ఆమె కుటుంబానికి అండగా నిలిచింది. వారికి కౌన్సెలింగ్ ఇవ్వడమే కాకుండా, నైతిక మరియు మానసిక మద్దతును అందిస్తూ విచారణలో కీలక పాత్ర పోషించింది. న్యాయం జరిగినందుకు బాధిత కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.



