లోడింగ్ ఇవ్వడం లేదు.. డీవోలు రావడం లేదు: రోడ్డెక్కిన లారీ యజమానులు.!
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలోని మహా సిమెంట్ (మై హోమ్) పరిశ్రమ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది

మేళ్లచెరువు మహా సిమెంట్ వద్ద ఉద్రిక్తత..!
డివోలను జారీ చేస్తామని హామీ మై హోమ్ సిమెంట్ యాజమాన్యం.?
స్థానిక రవాణాదారులపై వివక్ష? మహా సిమెంట్ యాజమాన్యంపై లారీ ఓనర్ల ఫైర్..!
ఉపాధిని దెబ్బతీయొద్దు.. డీవోలు జారీ చేయాలి: యాజమాన్య తీరుపై రవాణాదారుల ధ్వజం.!
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలోని మహా సిమెంట్ (మై హోమ్) పరిశ్రమ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
స్థానిక లారీ యజమానుల పట్ల యాజమాన్యం అనుసరిస్తున్న మొండివైఖరిని నిరసిస్తూ రవాణాదారులు శుక్రవారం భారీ ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం వద్ద లారీలను అడ్డంగా నిలిపివేసి, యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా లారీ యజమానుల సంఘం నాయకులు మాట్లాడుతూ.. పరిశ్రమ స్థాపన నుంచి తాము రవాణా రంగంలో సహకరిస్తున్నామని, అయితే గత కొంతకాలంగా స్థానిక లారీలకు డీవోలు ఇవ్వకుండా యాజమాన్యం వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక రవాణాదారులకు లోడింగ్ ఇవ్వకుండా బయటి ప్రాంతాల లారీలకు ప్రాధాన్యత ఇస్తూ తమ పొట్ట కొడుతున్నారని ఆరోపించారు.
తమ సమస్యలపై యాజమాన్యం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించే ప్రసక్తే లేదని యజమానులు మై హోమ్ సిమెంట్ ముఖద్వారం వద్ద బైఠాయించారు.
తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లారీ ఓనర్ల సమస్యపై స్పందించిన మై హోమ్ సిమెంట్ యాజమాన్యం డివోలను జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.



