ఒకే వేదికపై భూ సేవలు.. రైతులకు ఊరటగా సమీకృత భూభారతి పోర్టల్
భూమికి సంబంధించిన అన్ని సేవలను సులభతరం చేయడానికి ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ సేవలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా ‘సమీకృత భూభారతి పోర్టల్’ ను సిద్ధం చేసింది.

తెలంగాణ : రాష్ట్రంలో భూ వివాదాలతో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న రైతులకు ఊరట కలిగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భూమికి సంబంధించిన అన్ని సేవలను సులభతరం చేయడానికి ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ సేవలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా ‘సమీకృత భూభారతి పోర్టల్’ ను సిద్ధం చేసింది.
ఈ ఆధునిక సేవల ద్వారా రైతులు తమ భూ వివరాలను సులభంగా తెలుసుకోవడం, నమోదు చేయడం, వివాదాలను పరిష్కరించుకోవడం వంటి పనులు త్వరితగతిన పూర్తి చేసుకునే అవకాశం లభించనుంది.
ఈ పోర్టల్ను నేటి నుంచే రాష్ట్రంలోని కుసుమంచి, అశ్వారావుపేట, అమన్గల్, వట్పల్లి, కొస్గి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.
ఈ ప్రాంతాల్లో వచ్చిన స్పందనను పరిశీలించి, అవసరమైన మార్పులు చేసి, త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.
రైతులకు పారదర్శకంగా, వేగంగా భూ సేవలు అందించడం, భూ వివాదాలను తగ్గించడం, ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడం ఈ పోర్టల్ ముఖ్య లక్ష్యాలుగా అధికారులు తెలిపారు.
ఈ వ్యవస్థ అమలు కావడం ద్వారా రైతుల సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల వద్ద తిరగాల్సిన అవసరం కూడా తగ్గనుంది.
*_శ్రీనివాస్ నాయక్*
*స్టేట్ బ్యూరో, నిజం న్యూస్*



