జర్నలిజంపై ఖాకీ ఉక్కుపాదం…?
ఖమ్మం జిల్లాలోని భూదాన్ భూముల సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తున్న తొలివెలుగు బృందాన్ని నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కోర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

భూదాన్ భూముల కవరేజీకి వెళ్తుంటే అరెస్టులా..?
తొలివెలుగు రవి ఆవేదన..!
కోర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద హై డ్రామా..!
తెలంగాణలో జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రయత్నాలు పరాకాష్టకు చేరుకున్నాయి. ప్రజా సమస్యలను వెలికితీసేందుకు వెళ్తున్న మీడియా ప్రతినిధులపై పోలీసులు జులూం ప్రదర్శిస్తున్నారు.
తాజాగా తొలివెలుగు జర్నలిస్ట్ రఘు మరియు ఇతర ప్రతినిధులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
ఖమ్మం జిల్లాలోని భూదాన్ భూముల సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తున్న తొలివెలుగు బృందాన్ని నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కోర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
ముందస్తు సమాచారం లేకుండా, ఎటువంటి వారెంట్లు చూపకుండా జర్నలిస్ట్ రఘును అదుపులోకి తీసుకోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాను బాధ్యతలు నిర్వహించనీయకుండా అడ్డుకోవడం దేనికి సంకేతమని జర్నలిస్ట్ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
అరెస్టు చేసిన జర్నలిస్టులను పోలీసులు అత్యంత గోప్యంగా శాలిగౌరారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అసలు అరెస్టుకు గల కారణాలను స్పష్టం చేయకుండా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భూదాన్ భూముల్లో జరుగుతున్న అక్రమాలను ప్రభుత్వం బయటకు రాకుండా తొక్కేయాలని చూస్తోందా? అందుకే ఈ అరెస్టుల పర్వమా? అని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.



