మొదటి విడతలో హుజూర్నగర్ లో 1,000 మంది నిరు పేదలకు ఇళ్లు
ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అవినీతికి తావులేకుండా ఆర్డీఓ, మున్సిపల్ అధికారులు వ్యవహరించాలని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి హెచ్చరించారు..

మార్చి మొదటి వారంలో ‘ఇందిరమ్మ ఇళ్లు’ ప్రారంభం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..!
విడతలో హుజూర్నగర్కు చెందిన 1,000 ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ..!
హుజూర్నగర్లో ఒకే చోట 2,160 ఇళ్ల నిర్మాణం
– రాష్ట్ర చరిత్రలోనే నిలిచిపోనుంది..!
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, వచ్చే నెలలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాలు మరియు నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణ కేంద్రంలోని రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాల విస్తీర్ణంలో 125 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇళ్ల సముదాయాన్ని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్తో కలిసి మంత్రి పరిశీలించారు.
అనంతరం మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
2011లో తాను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే నిరుపేదలు, కూలీల కోసం ఈ ప్రాజెక్టును తలపెట్టానని గుర్తు చేశారు.
గత ప్రభుత్వం ఈ నిర్మాణాలను నిర్లక్ష్యం చేసి డంపింగ్ యార్డ్లా మార్చిందని విమర్శించారు. తన 14 ఏళ్ల పట్టుదల నేడు కార్యరూపం దాల్చడం, పేదల ఇళ్ల కల నెరవేరడం తన అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి భావోద్వేగంతో తెలిపారు.
పట్టణంలోని ఫనిగిరి రామస్వామి గుట్ట వద్ద 2,160 వేల ఇందిరమ్మ ఇండ్లను ఒకే చోట ఇంత భారీ స్థాయిలో నిర్మాణం రాష్ట్రంలోనే ప్రథమం.ఒక్కో ప్లాట్కు రూ. 6 లక్షల చొప్పున ఖర్చు చేశాం. రూ. 75 కోట్లతో అంతర్గత రోడ్లు, విద్యుత్, త్రాగునీరు మరియు డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటు.ఒక్కో ప్లాట్ 325 చదరపు అడుగులు.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఇళ్లను ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు.
మొదటి విడతలో స్థానిక హుజూర్నగర్కు చెందిన 1,000 మంది నిరుపేద, తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని వెల్లడించారు.
ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అవినీతికి తావులేకుండా ఆర్డీఓ, మున్సిపల్ అధికారులు వ్యవహరించాలని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు..



