నా పేరు చెప్పి కబ్జాలు, అక్రమ దందాలు చేస్తే ఫిర్యాదు చేయండి
పైరవీకారులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనుమానమొస్తే ఎంపీ కార్యాలయ సిబ్బందికి సమాచారమివ్వండి కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచన

వేములవాడ ఏప్రిల్ 3 ( నిజంచెపుతాం )
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తన పేరు చెప్పి ఎవరైనా కబ్జాలు, అక్రమ దందాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలుంటాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. ఎవరైనా తన పేరు చెప్పుకుని అక్రమ దందాలు చేస్తూ పంచాయతీలు, సెటిల్ మెంట్ల పేరుతో ఇబ్బంది పెడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. ఈ మేరకు బండి సంజయ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు సైతం అట్లాంటి పైరవీకారులపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ పార్టీకి మంచి పేరు తెచ్చేలా పని చేసేవారిని ప్రోత్సహిస్తానని, అదే సమయంలో ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇకపై తన పేరు చెబుతూ ఇబ్బంది పెడితే… వెంటనే తన ఎంపీ కార్యాలయ సిబ్బంది ద్రుష్టికి తీసుకురావాలని కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలను కోరారు.



